మధ్యాహ్నం 12.30గంటలకు ప్రారంభించనున్న సిఎం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారయ్యింది. ఈనెల 29వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు సిఎం కెసిఆర్ ధరణి పోర్టల్ను ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. దసరా పండుగ రోజు ధరణి ప్రారంభించాలనుకున్నా కొన్ని టెక్నికల్ కారణాలతో అది వాయిదా పడింది. ఈ వెబ్సైట్ ఇంగ్లీషుతో పాటు తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది. ధరణి వెబ్సైట్లో తెలుగు పేజీల ఏర్పాటుపై నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ రెండు రోజుల క్రితం సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. సామాన్యుడికి అర్థమయ్యే పదజాలంతో పాటు ఇంగ్లీషు పదాల తర్జుమాకు నిపుణుల కృషి చేస్తున్నారు. యూనికోడ్ ఫార్మాట్ ద్వారా తెలుగులో డేటాస్టోరేజ్లో నిక్షిప్తం చేసి రికార్డులను సరళతరం చేస్తున్నారు. ఈ విధానంతో భూముల పూర్తిస్థాయి సమీకృత రికార్డులు ఆన్లైన్లో నిక్షిప్తం అవుతున్నాయి. ఈ ధరణి వెబ్సైట్ను టిఎస్ఎస్ త్వరతగతిన రూపొందిస్తుండగా బ్లాక్చెయిన్ టెక్నాలజీతో నడిచే ఈ విధానంతో ఎన్నో అవాంతరాలు తొలగిపోనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
సామాన్యుడికి అర్థమయ్యేలా
ఇప్పటికే 90 శాతం ధరణి పోర్టల్ పూర్తయిన నేపథ్యంలో వెబ్సైట్ సామాన్యుడికి అర్థమయ్యేలా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల ధరణిని ప్రయోగాత్మకంగా పరిశీలించి కొన్ని లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దారు. దీంతోపాటు ఈ వెబ్సైట్ నిర్వహణకు అధికారులకు, సిబ్బందికి శిక్షణ సైతం ప్రభుత్వం ఇప్పించింది. ఇప్పటికే ట్రయల్న్ల్రో భాగంగా రాష్ట్రంలోని 570 మండలాల్లో తహసీల్దార్లు ప్రతి మండలానికి 10 దస్త్రావేజుల చొప్పున రిజిస్ట్రేషన్లను దిగ్విజయంగా పూర్తి చేశారు. మూడురోజులుగా చేస్తున్న ట్రయల్న్ల్రో రిజిస్ట్రేషన్ల విధానం బాగుందని, క్రయ, విక్రయాలకు ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుందని తహసీల్దార్లు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియచేశారు. దీంతో పూర్తిస్థాయిలో ధరణిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లతో ధరణిపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో సిఎస్ సోమేష్కుమార్ పలు సూచనలు, సలహాలు ఇవ్వడంతో ధరణి ప్రారంభానికి లైన్ క్లియర్ అయ్యింది.