Sunday, April 28, 2024

త్వరలో 20వేల పోలీసు కొలువులు

- Advertisement -
- Advertisement -

Telangana to recruit 20000 for police force

 

ఇప్పటికే 18,400 నియామకాలు జరిపాం
రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ప్రకటన
రికార్డు స్థాయిలో 1162 మంది ఎస్‌ఐల పాసింగ్ ఔట్ పరేడ్

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి వర కు 18,400ల పోలీసు నియామకాలు జరిపామని, త్వరలోనే మరో 20 వేల కొత్త నియామకాలు చేపట్టనున్నట్టు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తెలిపారు. రాష్ట్ర పోలీస్ అకాడమీలో శుక్రవారం నాడు జరిగిన 12 వ బ్యాచ్ 1162 మంది సబ్- ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు హోంమంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాంతి, భద్రతలకు ప్రాధాన్యం ఇచ్చిన సిఎం కెసిఆర్ పెద్ద ఎత్తున పోలీసు ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పన, ఆధునీకరణ, వాహనాల కొనుగోలుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారన్నారు. రాష్ట్రంలో మరేన్నడూ లేనివిధంగా 18428 మంది ఎస్.ఐ, కానిస్టేబుళ్ల నియామకం జరిపామని, ఇంకా ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలను కూడా త్వరలోనే నియమించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.

సమాజంలో రోజు రోజుకు వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిస్థితులను అర్థం చేసుకొని సమయోచితంగా, రాజ్యాంగ బద్దంగా పోలీస్ అధికారులు పనిచేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో అన్ని వర్గాల అవసరాలను, సమస్యలను ఓర్పుతో పరిష్కరించి సామరస్యాన్ని, సమైక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ దేశం లొనే ఆదర్శంగా ఉందని, ముఖ్యంగా మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నామని అన్నారు. సిసి కెమెరాల ఏర్పాటులో హైదరాబాద్ ప్రపంచంలోనే ముందంజలో ఉందని, త్వరలో ఏర్పాటు కానున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ టవర్ తో నేరాలను మరింత బాగా నియంత్రిస్తామని భరోసా వ్యక్తం చేశారు. కరోనా, భారీ వర్షాలలోనూ పోలీసులు అందించిన సేవలు ఆమోఘమైనవని ప్రశంసించారు.

చరిత్రలో ఇదో గర్వకారణం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇంత పెద్ద సంఖ్యలో శిక్షణ పొందిన యువ ఎస్.ఐ లు ప్రభుత్వ సేవలోకి ప్రవేశించడం గర్వకారణమని డిజిపి డాక్టర్ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేసి పోలీస్ శాఖకు తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పోలీస్ శాఖకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి పెద్దఎత్తున నిధులు, నియామకాలు జరిగెందుకు దోహదపడ్డారన్నారు. ముఖ్యమంత్రి విజన్ మేరకు నేరరహిత సమాజ స్థాపనకై చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. శాంతి భద్రతలు సక్రమంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని అన్నారు. సమాజంలో మార్పు పోలీసులతోనే సాధ్యమని, పోలీసింగ్ తో పాటు హరిత హారం, ఇతర ప్రభుత్వ పథకాల అమలులోనూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో సాంకేతికతను విరివిగా ఉపయోగించడం ద్వారా స్మార్ట్ పోలీసింగ్‌కు ప్రాధాన్యతనివ్వాలని, ఇందుకుగాను ఆధునిక సాంకేతికత, చట్టాలలో వచ్చే మార్పులకు ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ అందుకనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.

కాగా, ఈ పాసింగ్ ఔట్ పరేడ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 14 కాంటిజెంట్ల ఎస్‌ఐలు ప్రదర్శించిన కవాతు ఆకట్టుకుంది. వీరిలో, మూడు మహిళా ఎస్.ఐ. కాంటిజెంట్లు ఉన్నాయి. శిక్షణలో ఉత్తమ ప్రదర్శన కనపర్చిన ఎస్.ఐ. లకు పురస్కారాలను మంత్రి మహమూద్ అలీ, డిజిపి మహేందర్ రెడ్డి లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అకాడమీ జాయింట్ డైరెక్టర్ రమేష్ నాయు డు, డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News