Tuesday, April 30, 2024

విసి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల ఆందోళన

- Advertisement -
- Advertisement -

డిచ్‌పల్లి: తెలంగాణ విశ్వ విద్యాలయంలోని పరిపాలన భవనంలోని విసి ఛాంబర్‌లో మంగళవారం నిరసనలు వ్యక్తం చేస్తున్న పిడిఎస్‌యు, బివిఎం, ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థి సంఘాల నాయకులు విసి వెంటనే రాజీనామా చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. విసి ఎక్కడం సరైన పద్దతి కాదని అంటున్న మిగతా విద్యార్థిలు, ఇంతకు రిజిస్ట్రార్ ఎవరు?! అని విసిని నిలదీసిన విద్యార్థులు తెలంగాణ యూనివర్సిటీకి ఇద్దరు రిజిస్ట్రార్లా..? లేక ఒకరా..? అసలు రిజిస్ట్రార్ ఎవరూ అంటూ విద్యార్థి సంఘాల నాయకులు విసి ప్రొఫెసర్ డి. రవీందర్ గుప్తాను నిలదీశారు.

విసి రవీందర్ గుప్తా ఇంచార్జి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ కనకయ్యను నియమించారని తెలుసుకున్న విద్యార్థి నాయకులు విసి ఛాంబర్‌కు వచ్చారు. ఇప్పటికే పాలక మండలి రిజిస్ట్రార్‌గా నియమించిన ప్రొఫెసర్ యాదగిరి ఉండగా ఇప్పుడు ప్రొఫెసర్ కనకయ్యను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. యాదగిరికి ఆర్డర్స్ లేవని ఆయన రిజిస్ట్రార్‌గా విధులకు రాకపోవడంతోనే తాను కనకయ్యను నియమించినట్లు విసి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విసి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అనంతరం విద్యార్థి నాయకులు క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెయు విసి ప్రొఫెసర్ రవీందర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, తనది కేబినెట్ హోదా అని, అస్ట్రాల్ ఈసీ మెంబర్లు మీటింగ్‌కు పిలిస్తే నేనెందుకు వెళ్లాలని విద్యార్థులతో అంటున్నారని ఆరోపించారు.

ఈసీ రిజిస్ట్రార్ ఒకరిని నియమిస్తే వాటిని బేఖాతరు చేస్తూ విసి వేరొకరిని రిజిస్ట్రార్‌గా నియమిస్తున్నారని విమర్శించారు. వర్సిటీకి ఇద్దరు రిజిస్ట్రార్లు ఎలా ఉంటారని ప్రశ్నించారు. వర్సిటీకి రిజిస్ట్రార్ లేక అధ్యాపకులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసీ ఆమోదం లేకుండా పనులు చేస్తూ రూ. కోట్లు దుర్వినియోగం చేసిన విసిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్ లేకపోవడంతో విద్యార్థులకు మెమోలు ఇవ్వలేని దుస్థితిలో వర్సిటీ ఉందన్నారు. ఇదేమని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తే నా ఇష్టం వచ్చిన వారిని రిజిస్ట్రార్‌గా నియమిస్తానని, మీకు అవన్నీ అవసరం లేదని, ఎక్కువ మాట్లాడితే పోలీసులను పిలిపించి ఆరెస్టు చేయిస్తానని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విసిపై స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ పరువు ప్రతిష్టను కాపాడాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని విసి చాంబర్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. విసి రవీందర్ గుప్తా రిజిస్టర్ ఎవ్వరు అనేది తెలిసేంతవరకు విసి ఛాంబర్లో విసిని గైరావు చేసి దిగ్భంధించారు. అనంతరం సిఐ ప్రతాప్, ఎఎస్సై గణేష్‌లు వర్సిటీకి చేరుకొని విసిని పోలీసుల భద్రతల మధ్య విసి వాహనాన్ని ఎక్కనివ్వకుండా విద్యార్థి సంఘాలు అడ్డుకోగా పోలీసు వాహనంలో ఎక్కించుకొని విసి గృహానికి తీసుకు వెళ్లినారు. అనంతరం అన్ని విద్యార్థి సంఘాల నాయకులు కలిసి విసి మాకు వద్దు వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ విసి డౌన్ డౌన్‌నని ఆందోళన చేశారు. కార్యక్రమంలో అన్ని విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News