టోక్యో: టోక్యో ఒలింపిక్స్కు సంబంధించి నిర్వాహణ కమిటీ చీఫ్ తొషిరో ముటో చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాది జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ను కరోనా వల్ల వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. 20-201 జులైలో ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్టు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రీడలకు సంబంధించిన కొత్త షెడ్యూల్ను కూడా అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ విడుదల చేసింది. కానీ, తాజాగా నిర్వాహక కమిటీ చైర్మన్ ముటో చేసిన ప్రకటన పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. వచ్చే ఏడాది కూడా ఒలింపిక్స్ నిర్వహించడం కష్టమేనని ముటో చేసిన ప్రకటన క్రీడాకారుల్లో కొత్త భయాలను సృష్టిస్తోంది.
ఇప్పటికే ఏడాది పాటు క్రీడలు వాయిదా పడడంతో దీనికి అర్హత సాధించిన వారి పరిస్థితి అయోమయంగా తయారైంది. ఏడాది పాటు ఫిట్నెస్ను కాపాడుకుని క్రీడలకు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి చాలా మంది క్రీడాకారులకు నెలకొంది. ఇలాంటి స్థితిలో వచ్చే ఏడాది కూడా ఒలింపిక్స్ నిర్వహణ కష్టమేనని ప్రకటన వెలువడడం క్రీడాకారుల ఆందోళనను రెట్టింపు చేస్తోంది. కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోల వాతావరణం ఏర్పడింది. పలు దేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఇలాంటి స్థితిలో వచ్చే ఏడాది కూడా క్రీడలు జరుగుతాయా లేదా అనేది తాము కచ్చితంగా చెప్పలేమని నిర్వహణ కమిటీ చైర్మన్ తొషిరో ముటో పేర్కొన్నారు. తొషిరో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడాకారులకు శరాఘాతంగా మారాయని చెప్పక తప్పదు.