మనతెలంగాణ, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాపించకుండా పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని, వారి సేవలు ప్రశంసనీయమని సినీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. బషీర్బాగ్లోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఎదుట శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సినీ హీరో విజయ్ పోలీసులకు పిపిఈలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు తమ కుటుంబాలను వదిలేసి ఇరవైనాలుగు గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నారని అన్నారు. వారికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇంట్లో నుంచి ఎవరూ బయటికి రాకుండా ఉండి పోలీసులకు సహకరించాలని, దీనితోనే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని అన్నారు.
తాను ఇంట్లో నుంచి బయటికి రాక 20 రోజులు అవుతోందని తెలిపారు. లాక్డౌన్ విధించకపోతే కరోనా వైరస్ వ్యాప్తిని అరకట్టలేకపోయేవారమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సమయంలో లాక్డౌన్ను విధించాయని అన్నారు. ప్రపంచంలో లాక్డౌన్ను ఇండియా సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు. తెలంగాణ వైద్యుల సంఘం పోలీసులకు హెడ్షీల్డ్ ఇవ్వడం అభినందనీయం అని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఎన్.శంకర్, నగర అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సినిమా ఫిల్డ్ నుంచి ప్రోత్సాహం గుడ్ : అంజనీకుమార్, నగర పోలీస్ కమిషనర్
ఈ పరిస్థితుల్లో సినీ రంగం నుంచి తమకు మద్దతు రావడం అభినందనీయమని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. వైద్యుల బృందం పోలీసులకు హెడ్ప్రోటెక్టీవ్ షీట్స్ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. పోలీసులకు ఎప్పటిప్పుడు మోటివేషన్ స్పీచ్ ద్వారా ఉత్సాహం ఇస్తున్నామని తెలిపారు. ఫేస్ను రక్షించుకునేందుకు ప్రొటెక్టీవ్ కిట్ పనిచేస్తుందన్నారు. కానిస్టేబుల్ పోలీస్ ఆఫీసర్లు షీఫ్ట్ సిస్టంలో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులకు తమ మద్దతు ఉంటుందని అన్నారు.