Wednesday, May 1, 2024

తెలంగాణలో ముగ్గురితో కొట్లాడుతున్నాం: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాజకీయాల్లో ఎవరితో పోరాడుతున్నామో అవగాహన ఉండాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. తుక్కుగూడ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మనకు వ్యతిరేకంగా ఉన్న శక్తుల గురించి తెలిసి ఉండాలని, తెలంగాణలో కేవలం బిఆర్‌ఎస్‌తో మాత్రమే కాంగ్రెస్ పోరాడటం లేదని, బిజెపి, మజ్లిస్ పార్టీలతో కూడా పోరాడుతున్నామని ఆ యన అన్నారు. తాము వేర్వేరు పార్టీలని బిఆర్‌ఎస్, బిజె పి, మజ్లిస్ చెప్పుకుంటాయని, ఈ మూడు పార్టీలు కలిసే ఉంటాయని ఆయన ఆరోపించారు. రైతు బిల్లులతో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బిఆర్‌ఎస్ పార్టీ బిజెపికి మద్దతిచ్చిందన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని ఆయన తెలిపారు. ప్రజలకు గ్యారంటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేసిందని, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆరు గ్యారెంటీలను ఇస్తోందని, వాటిని అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని రాహుల్ తెలిపారు.

సోనియాగాంధీ ఓట్ల కోసం తెలంగాణ ఇవ్వలేదు : మల్లిఖార్జున ఖర్గే
తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17 చారిత్రాత్మకమైన రోజు అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల కోసం 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించిందని, అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని అమలు చేస్తామన్నారు. రైతులకు రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని, పట్టా భూమి రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రూ.15 వేలు రైతు భరోసా కింద ఇస్తామని ఖర్గే స్పష్టం చేశారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు చెల్లిస్తామని, వరి పంటకు క్వింటాల్‌కు అదనంగా రూ.500ల బోనస్ ఇస్తామని ఖర్గే హామీ ఇచ్చారు. పేదలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని, ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందన్నారు. సోనియాగాంధీ ఓట్ల కోసం తెలంగాణ ఇవ్వలేదని, తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చేందుకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ చట్టం చేసింది కాంగ్రెసే అని, ఆహార భద్రత చట్టం చేసి ప్రజల ఆకలి తీర్చిందన్నారు.

ఆరు గ్యారంటీలతో బంగారు భవిష్యత్‌కు పునాది : రేవంత్‌రెడ్డి
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో బంగారు భవిష్యత్‌కు పునాది పడుతుందన్నారు. కాంగ్రెస్‌కు రాష్ట్ర ప్రజలు అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News