మన తెలంగాణ/హైదరాబాద్: తమాషాలు బంద్ చేయి.. లేదంటే సోనియాకు చెబుతానంటూ ఎంపి రేవంత్రెడ్డిపై ఎంఎల్ఎ జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. రేవంత్ అనుచరులు ఫేస్బుక్లో పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని మండిపడ్దారు. కాంగ్రెస్ ఎంఎల్ఏలంతా అసెంబ్లీలో కూర్చుని ప్రజా సమస్యలపై మాట్లాడాలా? లేక రేవంత్ అనుచరులు ఫేస్బుక్లో పెట్టే పోస్టులను చూస్తూ కూర్చోవాలా? అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి ఏమైనా తీస్మార్ఖానా.. నిన్నగాక మొన్న వచ్చి సిఎం అంటాడా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికీ సిఎం కావాలని ఉంటుందని, కానీ అంతిమ నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్దేనని జగ్గారెడ్డి అన్నారు. పార్టీని ఎలా పైకి తీసుకురావాలో తమకు బాగా తెలుసునన్నారు. రేవంత్రెడ్డి నిజంగా పులి, సింహమే అయితే.. సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో ఎందుకు ఓడిపోయాడని ప్రశ్నించారు. పులులు, సింహాలు రెండు వేల మెజార్టీతో గెలుస్తాయా? అని ప్రశ్నించారు.
వ్యక్తిగత కేసులను పార్టీకి రుద్దడమేంటి? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యే పదవిలో లేనప్పుడు ప్రభుత్వం తనపై కూడా కేసులు పెట్టిందని, అయినా వాటిని ఎదుర్కొన్నానే తప్ప పార్టీకి రుద్దలేదన్నారు. తెలి యక పాస్పోర్ట్ కేసులో సంతకాలు పెట్టి ఇరుక్కున్నానని, తప్పు తప్పే కాబట్టి కేసులను ఎదుర్కొంటున్నానన్నారు. అనుచరులు ప్రతి ఒక్కరికీ ఉన్నారని గుర్తు చేశారు. తాను చిటికేస్తే సంగారెడ్డి నుంచి 10 వేల మంది నడుచుకుంటూ వస్తారని.. కోమటిరెడ్డి బ్రదర్స్ చిటికేస్తే నల్గొండ నుంచి లక్ష మంది వస్తారని అన్నారు. ఎవరికి లేరు అనుచరులు.. శ్రీధర్బాబుకు లేరా.. జానారెడ్డికి లేరా అంటూ మండిపడ్డారు. రేవంత్ అనుచరులు ఇకనైనా తమాషాలు పక్కనపెట్టాలని, శ్రీధర్బాబు కారు ఎక్కబోతున్నారు లాంటి ప్రచారాన్ని ఆపాలని హెచ్చరించారు. రేవంత్రెడ్డిపై ఈ స్థాయిలో తానెప్పుడు ఫైర్ అవలేదని, కానీ రేవంత్, ఆయన అనుచరుల వ్యవహారంతో మొదటి సారి తీవ్రంగా నొచ్చుకున్నానని జగ్గారెడ్డి చెప్పారు.
Congress MLA Jagga Reddy fires on MP Revanth Reddy