Tuesday, May 7, 2024

ఎంపిగా రాహుల్‌కు నేడు గ్రీన్‌సిగ్నల్?.. సంతకాలే తరువాయి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ పునరుద్ధరణ ప్రక్రియ సోమవారం జరుగుతుందని భావిస్తున్నారు. ఇటీవలే సుప్రీంకోర్టు ఆయనపై పరువునష్టం దావాలో జైలుశిక్షపై స్టే విధించింది.ఈ క్రమంలో ఆయన ఎంపి స్థానం తిరిగి దక్కేందుకు రంగం సిద్ధం అయింది. ఇప్పుడు ఆయన సభ్యత్వ పునరుద్ధరణ సంబంధిత పత్రాలు అన్ని కూడా సిద్ధం అయ్యాయి. ఇక లోక్‌సభ స్పీకర్ వీటిపై సంతకాలు చేయడమే తరువాయిగా వెల్లడైంది. సోమవారం స్పీకర్ ఓం బిర్లా సంబంధిత ప్రక్రియకు తమ అధికారిక సమ్మతి ఇస్తారని విశ్వసనీయంగా తెలిసింది.

రాహుల్‌కు గుజరాత్ సెషన్స్ కోర్టు అనర్హత వేటువేయగానే స్పీకర్ మరుసటి రోజే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేశారని, మరి రోజులు గడుస్తున్నా ఇప్పుడు సభ్యత్వ పునరుద్ధరణలో ఎందుకు జాప్యం జరుగుతోందని కాంగ్రెస్ నిలదీస్తోంది. మరీ జాప్యం చేస్తే ఇక తాము తిరిగి కోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాహుల్ సీటు పునరుద్ధరణపై ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పెట్టేందుకు, స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చేందుకు సంఘటిత విపక్షం ఇండియా కూడా రంగంలోకి దిగుతోంది.

వెంటనే ఆయన ఎంపి సీటు పునరుద్ధరణ జరిగితీరాలని పట్టుపడుతున్నారు. అయితే వెనువెంటనే ఎంపి సీటు పునరుద్ధరణ జరగడం కుదరదని, పద్ధతులు ఉంటాయని , ఇంతకు ముందు లక్షద్వీప్ ఎంపి ఫైజల్ విషయంలో నెలరోజులు పట్టిందని అధికార బిజెపి లోపాయికారిగా చెపుతోంది. అన్ని విషయాలపై స్పీకర్ నిర్ణయం తీసుకుని స్పీకర్ రాహుల్ సభ్యత్వ పునరుద్ధరణకు స్పీకర్ అనుమతిని ఇస్తే ఇక ఆయన పార్లమెంట్‌కు విరామానంతరం హాజరయ్యేందుకు వీలేర్పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News