Tuesday, April 30, 2024

10 రోజుల్లో ల్యాబ్ సిద్ధం

- Advertisement -
- Advertisement -
Gandhi
గాంధీలో ‘కరోనా’ నిర్ధారణ పరీక్షలు

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు గాంధీ ఆసుపత్రిలో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేసింది. గాంధీ ఆస్పత్రిలో వచ్చే 10 రోజుల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు కరోనా పరీక్షలు పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజి(ఎన్‌ఐవి)లో నిర్వహిస్తున్నారు. అక్కడికి రక్తనమూనాలను కొరియర్ ద్వారా విమానాల్లో పంపిస్తున్నారు. దీంతో ఫలితాలు రావడానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇప్పుడు ఈ ఇబ్బందులేవీ లేకుండా గాంధీ ఆసుపత్రిలోనే నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించింది. ఇందుకు కేం ద్రం ఆమోదం తెలిపింది.

గాంధీ ఆసుపత్రిలోని వైరాలజీ ల్యాబ్‌లో కరోనా పరీక్షలు చేసేందుకు అనువుగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో కరోనా నిర్ధారణ కిట్లను సరఫరా చేయాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఫీవర్ ఆసుపత్రిలోనూ వైద్య పరీక్షలు చేయడానికి వీలుందని పేర్కొంటున్నారు. కాగా, దేశంలోని 10 కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అందులో గాంధీ ఆసుపత్రి కూడా ఒకటి.

రెండు సార్లు పరీక్షలు తప్పనిసరి

కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తులకు ఇక నుంచి రెండు సార్లు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రానికి మార్గదర్శకాలు జారీచేసింది. ఒకసారి రక్త పరీక్ష చేశాక అందులో నెగిటివ్ వస్తే తర్వాత 48 గంటల్లో మరోసారి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. దీనివల్ల పూర్తిస్థాయిలో కచ్చితత్వం వస్తుందనేది కేంద్రం భావిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో 10 మంది కరోనా అనుమానంతో ఫీవర్ ఆసుపత్రికి వచ్చారు. వారిలో ఐదుగురికి ఎలాంటి లక్షణాల్లేవని నిర్ధారించారు. మరో ఐదుగురి రక్త నమూనాలను పుణేకు పంపించారు. వీరి ఫలితాలు ఒకటి రెండు రోజుల్లో రానున్నాయి. అయితే మొదటి ఐదుగురికి నెగిటివ్ వచ్చినా మరోసారి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఆ ఐదుగురిలో ముగ్గురు చైనాలోని వుహాన్ నుంచి హాంకాంగ్ మీదుగా భారత్‌కు వచ్చినట్లు ఫీవర్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

‘కరోనా’ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరిన మియాపూర్ వాసి

కరోనా వైరస్ లక్షణాలతో మియాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే అతను చైనా నుంచి నగరానికి వచ్చారు. అయితే ప్రస్తుతం గాంధీలో అతనికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేటెడ్ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వ్యాధి నిర్థారణ పరీక్షల నిమిత్తం రోగి రక్త నమూనాలను పూణె పంపించనున్నారు.

మరోవైపు కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఫీవర్ ఆసుపత్రిలో చేరిన ముగ్గురిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కరోనా లక్షణాలతో మూడు రోజుల క్రితం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఫీవర్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన భర్త(31), భార్య(26), కూతురు(4) జలుబు, దగ్గుతో ఫీవర్ ఆసుపత్రిలో చేరారు. వారి రక్త నమూనాలను సేకరించి వైద్య పరీక్షల కోసం పూణెకు పంపారు. నివేదికలో నెగెటివ్ అని తేలడంతో వారినిడిశ్చార్జ్ చేసి పంపించారు.

 

Coronavirus diagnostic tests in gandhi hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News