Tuesday, April 30, 2024

చనిపోయిన బాలుడు స్మశానంలో బతికాడు!

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించిన ఒక ఏడాదిన్నర వయసుగల బాలుడు స్మశానంలో లేచికూర్చున్న వింత సంఘటన కర్నాటకలో గురువారం చోటుచేసుకుంది.

హుబ్బలి జిల్లాలోని నవల్‌గుండ్ తాలూకా బసాపూర్ గ్రామంలోని స్మశానవాటికలో చనిపోయిన బాలుడికి అంత్యక్రియలలో భాగంగా సాంప్రదాయం ప్రకారం నోట్లో నీళ్లు పోయగా ఆ బాలుడు కాళ్చూ ,చేతులూ కదుపుతూ కళ్లు తెరవడంతో ఆ బాలుడి బంధువులు షాక్‌కు గురయ్యారు. అయితే ఆ బాలుడు మరణించినట్లు తాము ధ్రువీకరించలేదని, వైద్యుల సలహాను పట్టించుకోకుండా ఆ బాలుడు జీవించి ఉన్నపుడే అతడి బంధువులు దిశ్చార్జ చేసి తీసుకెళ్లిపోయారని హుబ్బలిలోని కర్నాటక వైద్య శాస్త్రాల సంస్థ(కిమ్స్) స్పష్టం చేసింది.

అనారోగ్యంతో ఉన్న బసాపూర్ గ్రామానికి చెందిన ఆకాశ్ బసవరాజ్ పుజార్ అనే ఏడాదిన్నరేళ్ల బాలుడిని మొదట గడగ్‌లోని జర్మన్ ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం అక్కడి నుంచి ధార్వాడ్‌లోని ఎస్‌డిఎం ఆసుపత్రికి, ఆ తర్వాత హుబ్బలిలోని కిమ్స్‌కు మార్చారు. బాలుడి గుండె చాలా తక్కువస్థాయిలో పనిచేస్తోందని, అతడికి ఆక్సిజన్ సపోర్ట్ పెట్టామని కిమ్స్ డాక్టర్లు తెలిపారు. అయితే.. ఆ తర్వాత బాలుడు మరణించినట్లు డాక్టర్లు చెప్పారని గ్రామస్తులు చెప్పారు. బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు జరుపుతున్న క్రమంలో సాంప్రదాయం ప్రకారం నోట్లో నీళ్లు పోయగా అతడి కాళ్లు, చేతులు కదిలాయని గ్రామస్తులు తెలిపారు.

ఇదిలా ఉండగా బతికున్నప్పుడే ఆ బాలుడిని అతడి బంధువులు డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లిపోయారని కిమ్స్ డైరెక్టర్ రామలింగప్ప అంతరతని తెలిపారు. మెదడులో ఇన్ఫెక్షన్, ఫ్లూయిడ్ కోసం ఆ బాలుడికి చికిత్స జరుగుతోందని ఆయన చెప్పారు. చికిత్స వద్దంటూ ఆ బాలుడిని అతని బంధువులే తీసుకెళ్లిపోయారని ఆయన తెలిపారు. బాలుడు మరణించినట్లు తాము లేఖ ఏదీ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News