మనతెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఎస్ఐ అస్లుప్ ను నగర పోలీసులు అరెస్టు చేశారు. మూడు కమిషనరేట్ల పోలీసులు దొంగ ఎస్ఐ నేరాల చిట్టాపై విచారణ సాగిస్తున్నారు. అస్లుప్ నేరాలపై హరియాణా క్రెమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ చేపడుతున్న క్రమంలో హైదరాబాద్లోనూ నేరాలు చేసినట్లు అంగీకరించాడు. దీంతో నగర పోలీసులు ఆదిశగా అస్లుప్ నేరాలపై దృష్టి సారిస్తున్నారు. ఇదిలావుండగా ఢిల్లీ పోలీసు విభాగంలో అస్లుప్ ఎస్ఐగా పనిచేస్తూ దొంగ సొత్తులను విక్రయిస్తూ, దొంగ తనాలకు పాల్పడుతూ తన ఉద్యోగం పోగొట్టుకున్నాడు. పలు నేరారోపణల కారణంగా దొంగగా మారిన ఎస్ఐని జైలుకు తరలించారు. అయితే, జైలు నుంచి బయటకొచ్చాక నేరాలు చేయడాన్నే వృత్తిగా చేసుకున్నాడు. ఎటిఎంల్లో చోరీలు, హత్యాయత్నాలు, దాడులు, దొంగతనాలు చేయడంలో ఆరితేరాడు.
పోలీసులకు చిక్కకుండా, తన ఉనికి బయటపడకుండా ఈ నేరాలన్నీ ఒంటరిగానే చేస్తూ వచ్చాడు. హైదరాబాద్తో పాటు హరియాణా, కేరళ, మహారాష్ట్ర, కోల్కతా, గుజరాత్, రాజస్తాన్, ఒడిశాలోని పలు నగరాల్లో మొత్తం 24 నేరాలు చేసిన ఇతడు మోస్ట్ వాంటెట్గా మారాడు. అప్పటి నుంచి వరుస నేరాలు చేస్తూ ఎనిమిది రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా మారాడు. గతవారం హరియాణాకు చెందిన క్రైం పోలీసులు అస్లుప్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాను హైదరాబాద్లోనూ నేరాలు చేసినట్లు అస్లుప్ అంగీకరించాడు. దీంతో హరియాణ పోలీసులు హైదరాబాద్ నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈక్రమంలో హరియాణ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో ఎక్కడెక్కడ నేరాలు చేశాడన్న కోణంలో విచారణ చేపడుతున్నారు.
Delhi Sub Inspector Arrested in Hyderabad for theft