మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజులు భారీ వర్షాలున్నందున రాష్ట్రంలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ల నుండి జిల్లా ఎస్.పి, పోలీస్ కమీషనర్లందరూ అప్రమత్తంగా ఉండాలని డిజిపి ఎం.మహేందర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పోలీస్ శాఖ మొత్తాన్ని డిజిపి అప్రమత్తం చేశారు. పోలీస్ అధికారులందరూ 24 గంటల పాటు విధుల్లో ఉండి ప్రజలకు ఏవిధమైన అసౌకర్యం కలుగ కుండా చూడాలని పేర్కొన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు, విపత్తుల నివారణ శాఖ, ఇతర శాఖలతో సమన్వయంతో పని చేయాలని అన్నారు. ప్రధానంగా డయల్ 100 కు వచ్చే కాల్స్ అన్నింటినీ ప్రాధాన్యతతో చేపట్టి పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఏవిధమైన ఇబ్బందులు ఎదురైనా డయల్ 100 కు ఫోన్ చేయాలని రాష్ట్ర ప్రజలను డిజిపి ఆ ప్రకటనలో కోరారు.
DGP Mahender reddy alerts police due to rain warning