Thursday, May 2, 2024

ఆరోగ్య శ్రీ లబ్దిదారులకు డిజిటల్ కార్డులు

- Advertisement -
- Advertisement -

జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా పంపిణీ
కోఠి ఇఎన్‌టి ఆసుపత్రికి రూ. కోటి 30 లక్షల
అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయం
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 2 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచిన దృష్ట్యా కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ఇందుకోసం లబ్ధిదారుల ఇ కెవైసి ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అధ్వర్యంలో బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఇఒ విశాలాచ్చి, సిఎం ఒఎస్‌డి గంగాధర్, డిఎంఇ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి.శ్రీనివాస్ రావు, టివివిపి కమిషనర్ అజయ్ కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, నిమ్స్ స్పెషలిస్ట్ డాక్టర్‌ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్ ఆడిట్ నిర్వహించాలని అన్నారు. కొవిడ్ సమయంలో ఎక్కడా చేయని విధంగా రికార్డు స్థాయిలో 856 బ్లాక్ ఫంగస్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించి, ప్రజల ప్రాణాలు కాపాడిన కోఠి ఇఎన్‌టి ఆసుపత్రికి రూ. కోటి 30 లక్షల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. మూగ, చెవిటి పిల్లలకు చికిత్స అందించి బాగు చేసే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు ప్రస్తుతం కోఠి ఇఎన్‌టి ఆసుపత్రిలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదని చెప్పారు. ఈ తరహా సేవలను వరంగల్‌లో ఎంజిఎంలో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఆరోగ్యశ్రీ రోగులకు ఫేస్ రెకగ్నిషన్ వినియోగానికి అనుమతి
తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 3 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉంటే, తెలంగాణ ప్రభుత్వం ఆ సంఖ్యను 103కు పెంచిందని మంత్రి తెలిపారు. వ్యవప్రయాసలకు ఓర్చి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నియోజకవర్గం పరిధిలోనే డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. దీంతో కిడ్నీ బాధితులకు ఈ కేంద్రాలు వరంగా మారాయని పేర్కొన్నారు. మరింత నాణ్యంగా డయాలిసిస్ సేవలు అందించేందుకుగాను ఆన్‌లైన్ పర్యవేక్షణ చేసే విధంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించి, వినియోగించడానికి బోర్డు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఆరోగ్యశ్రీ రోగులకు ఫేస్ రెకగ్నిషన్ సాఫ్ట్‌వేర్ వినియోగానికి కమిటి అనుమతి ఇచ్చింది. బయోమెట్రిక్ విధానం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో మరింత పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించేందుకు ఈ విధానం తేవాలని నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News