Friday, May 3, 2024

అందరికీ హెల్త్ కార్డులు

- Advertisement -
- Advertisement -

హెల్త్ ప్రొఫైల్ తో డిజిటల్ కార్డులను సిద్ధం చేయాలి

ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపులు వేగవంతం
బీబీ నగర్ ఎయిమ్స్ పూర్తి సేవలందించేలా దృష్టి
ఆరోగ్యశ్రీకి తెల్లరేషన్ కార్డు నిబంధన సడలింపుకు చర్యలు
మెడికల్ కళాశాల ఉన్నచోట పారామెడికల్ కళాశాల ఉండాలి
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు వేగం చేపట్టాలి
వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్ తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని, ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీ ని అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని అధికారులతో చర్చించారు. ఈ నిబంధన కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్, ఫీజియోథెరపీ, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తు , కమీషనర్ కర్ణన్, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ కమలహాసన్ రెడ్డి, సీఈఓ ఆరోగ్యశ్రీ విచలక్షి, తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వరంగల్, ఎల్బీ నగర్, సనత్ నగర్, అల్వాల్ లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వైద్యుల కొరత లేకుండా మెడికల్ కాలేజీలను ఆసుపత్రులకు అనుసంధానంగా ఉండేలా చూడాలన్నారు. రాష్ట్రంలో మెడికల్, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీల్లో ఇంకా ప్రారంభం కాని వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొడంగల్ లో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు పరిశీలన జరపాలని అధికారులకు సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని, ఎయిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. దీంతో ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులపై భారం తగ్గుతుందని, ఎయిమ్స్ ను సందర్శించి పూర్తిస్థాయి రిపోర్టు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్రమంత్రిని కలిసి వివరిస్తానని తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం కేవలం హైదరాబాద్ పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. ఏరియాల వారీగా ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్నారు. సంబంధిత మెడికల్ కాలేజీల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలో సమస్యలను అధికారులు సీఎంకు వివరించారు. ఉస్మానియా హెరిటేజ్ భవనానికి సంబంధించి కోర్టులో ఉన్నందున, కోర్టు సూచనల ప్రకారం ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకుందామన్నారు. మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్ కీపింగ్ మెయింటెనెన్స్ నిర్వహణ బాధ్యతను పెద్ద ఫార్మా కంపెనీలు తమ సి ఎస్ ఆర్ నిధులను ఉపయోగించి హౌస్ కీపింగ్ సేవలను మెరుగుపరచాల న్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో ఏదో ఒక ఆసుపత్రిలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు, నిధులకు సంబంధించి సీఎం అధికారులతో చర్చించారు. ప్రతి నెల ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విధిగా విడుదల చేయాలని అన్నారు. ప్రయివేటు ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రతి మూడు నెలలకోసారి విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా వున్న టీచింగ్ హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్ కు పెండింగ్ లో ఉన్న రూ.270 కోట్ల ఆరోగ్య శ్రీ బిల్లులు వెంటనే విడుదల చేయాలని చెప్పారు. అలాగే జూనియర్ డాక్టర్స్ , ఆశ వర్కర్స్, స్టాఫ్ నర్సుల జీతాలు ప్రతి నెల క్రమం తప్పకుండ అందించేలా చూడాలన్నారు. 108,102 సేవల పనితీరును ముఖ్యమంత్రి అరా తీశారు, మెరుగైన సేవలు అందించేలా చూడాలని ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News