డిజిటల్ లావాదేవీల నిర్వహణకు ప్రత్యేక అనుమతి ఇవ్వండి
హెచ్పిసిఎల్ రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటికి పెట్రోలియం డీలర్ల విజ్ఞప్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : పెట్రోల్ బంకుల్లో నగదు లావాదేవీలను నిలిపివేయాలని కోరుతూ పెట్రోలియం డీలర్ల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం హెచ్పిసిఎల్ రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటికి సోమవారం ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. కరోనా వైరస్ను తీవ్రతను దృష్టిలో పెట్టుకుని డిజిటల్ లావాదేవీల నిర్వహణకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోరింది. కోవిద్-19ని దృష్టిలో ఉంచుకుని పెట్రోల్ బంకుల పని వేళలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండేటట్లు చూడాలని వినతి పత్రంలో కోరింది. ప్రధానంగా నగదు లావాదేవీల కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకావమున్న నేపథ్యంలో కొన్ని బ్యాంకులు నగదు తీసుకోడానికి నిరాకరిస్తున్నాయని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలను మాత్రమే అనుమతించాలని కోరింది. సామాజిక బాధ్యతతో వాహనదారులు వారి మధ్య దూరాన్ని పాటించేటట్లు పోలీసు రక్షణ కల్పించాలని కూడా సూచింంచింది. అలాగే పెట్రోల్ బంకుల వద్ద…వాహనదారులకు స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహించేట్లు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నది. స్థానిక సంస్థల ద్వారా ప్రతి పెట్రోల్ బంకులో ప్రతి రోజు శానిటైజేషన్ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరింది. హెచ్పిసిఎల్ సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ రాజేశ్కు సమర్పించిన వినతిపత్రంలో తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. అమరేందర్ రెడ్డి, ఇతర ప్రతినిధులు ఉన్నారు.