సిఎం కెసిఆర్కు ఎపి సిఎం జగన్ విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : విదేశాల నుంచి తెలుగు ప్రజలు ప్రత్యేక విమానాల్లో భారీ సంఖ్యలో హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇలా వచ్చిన వారిలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు ఉన్నారు. ఇందులో భాగంగా కువైట్ నుంచి ప్రత్యేక విమానంలో 167 మందిని సోమవారం హైదరాబాద్కు తీసుకొచ్చారు. గల్ఫ్ దేశాల నుంచి హైదరాబాద్కు విమానాల ద్వారా తరలిస్తోన్న వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉద్యోగులు, కార్మికులు ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగగానే అందరిలాగానే తెలంగాణ ప్రభుత్వం వారిని పెయిడ్ క్వారంటైన్కు పంపిస్తోంది. రాష్ట్రం విడిచి వెళ్లడానికి అనుమతి ఇవ్వడం లేదు.
దీంతో విదేశాల నుంచి వస్తోన్న ఎపి వాసులు హైదరాబాద్లో క్వారంటైన్లో ఉండలేరని, వారిని తమ రాష్ట్రానికి పంపించాలని ఎపి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి మంగళవారం విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి సైతం ఎపి ప్రభుత్వం తీసుకెళ్లింది. శంషాబాద్లో ఎపి రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని ఎపి ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలకు విమానాలను మళ్లించాలని ఎపి సిఎం జగన్ సైతం కేంద్రానికి విన్నవించారు. దీంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై ఇరురాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.