ఐజావల్ : మిజోరంలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతగా నమోదైన ఈ ప్రకంపనలకు అనేక ప్రాంతాలలో రోడ్లు బీటలువారగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. తెల్లవారుజామున 4.10 గంటలకు భూప్రకంపనలు సంభవించాయని అధికారులు చెప్పారు. భారత్-మయన్మార్ సరిహద్దులోని చంఫాల్ జిల్లాలోని జోఖావ్తార్ వద్ద ఇది కేంద్రీకృతమైందని వారు వెల్లడించారు. రాష్ట్ర రాజధాని ఐజావల్తో సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో భూమి కంపించినట్లు వారు వివరించారు. కాగా, భూకంపంతో దెబ్బతిన్న మిజోరం రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంతంగాకు హామీ ఇచ్చారు. మిజోరం ముఖ్యమంత్రితో తాను మాట్లాడానని, తగిన సహాయం కేంద్రం అందచేస్తుందని హామీ ఇచ్చానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ముఖ్యమంత్రి జోరంతంగాతో మాట్లాడారు.