Sunday, May 5, 2024

బాల భారతి యాజమాన్యం నిర్లక్ష్యంతో పేదలకు విద్య దూరం

- Advertisement -
- Advertisement -
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు

హైదరాబాద్ : వేలాదిమంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించిన సిర్పూర్ పేపర్ మిల్ (ఎస్పీఎం) బాల భారతి పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో దీనావస్థలో ఉందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సోమవారం కాగజ్ నగర్ పట్టణంలోని బాల భారతి పాఠశాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బాల భారతి పాఠశాలపై పాలకులు శీతకన్ను వహించడం సరికాదన్నారు. 1960 లో ఏర్పాటైన బాలభారతి పాఠశాలలో నాణ్యమైన విద్య,మౌలిక సదుపాయాలు సమకూర్చాల్సిన సిర్పూర్ పేపర్ మిల్ (ఎస్పీఎం) యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. పేద విద్యార్థులు చదివే పాఠశాలపై ఎస్పీఎం యాజమాన్యం దౌర్జన్యాలు,దురాగాతలకు వందల మంది విద్యార్థులు బలవుతున్నారన్నారు. కనీసం పాఠశాలకు విద్యుత్, త్రాగునీరు బందు చేస్తూ పాఠశాల యాజమాన్యాన్ని భయ బ్రాంతులకు గురిచేస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్లు విలువచేసే పాఠశాల స్థలాన్ని అక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి,కోట్ల రూపాయలకు విక్రయించాలనే ఉద్దేశంతో ఎస్పీఎం యాజమాన్యం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. దీని వెనుక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హస్తముందని ఆరోపించారు.
మున్సిపాలిటీ నిధులతో రూ.50 లక్షలు ఖర్చుచేసి వేసిన రోడ్డును ఎస్పీఎం యాజమాన్యం ఆక్రమించి, ప్రహరీ గోడనిర్మించి మూసివేశారని అన్నారు. పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడానికి స్థానిక ఎమ్మెల్యే,జేకే యాజమాన్యంతో కుమ్మక్కై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాగజ్ నగర్ గిరిజన ఆశ్రమ పాఠశాలకు సరిపడ నిధులు లేక వెలవెలబోతుందని అన్నారు. బాలభారతి ఎడ్యుకేషన్ సొసైటీపై ఎస్పీఎం కంపెనీ యాజమాన్యం దౌర్జన్యం చేస్తుందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్య లేకపోవడంతోనే చాలామంది పేద పిల్లలు చదువులకు దూరమైతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజలు ఉన్నత చదువులు చదువుకొని,ఆత్మ గౌరవంతో బతుకవద్దని కుట్రలతోనే ఆధిపత్య కులాల పెద్దలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విరుచుకపడ్డారు. సిర్పూర్ ప్రాంత ప్రజల బాగోగులు పట్టించుకోవాల్సిన స్థానిక ఎమ్మెల్యే కంపెనీ యాజమాన్యానికి వత్తాసు పేదలను చదువులకు దూరం చేస్తున్నారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News