Sunday, April 28, 2024

పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి : అల్లం నారాయణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:   నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వానికి యూనియన్ పక్షాన అభినందనలు తెలపడంతో పాటు, మ్యానిఫెస్టోలో పొందుపరిచిన జర్నలిస్టు సంక్షేమ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి వాటి సాధనకు కృషి చేస్తామని టియుడబ్ల్యూజెహెచ్ 143 (జర్నలిస్ట్ ట్రేడ్ యూనియన్) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు.  ఉప్పల్ భగాయత్ యూనియన్ కార్యాలయ స్థలంలో ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అల్లం నారాయణ మాట్లాడుతూ హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలలో కొన్ని నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యతోపాటు, 10 లక్షల రూపాయల ఆరోగ్య భద్రత కల్పించే హెల్త్ కార్డు విషయంలో సైతం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేసుకుందామన్నారు.

నగదు రహిత హెల్త్ కార్డులు చలామణి అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అందుకు యూనియన్ కృషి చేస్తుందన్నారు. దీంతో పాటు పలు జిల్లాలలో నూతన కార్యవర్గాలను ఫిబ్రవరి 29 లోపు నిర్మించుకుందామని, తదనంతరం మార్చిలో రాష్ట్ర మహాసభ ఏర్పాటు చేసుకుందామని ఆయన వెల్లడించారు. యూనియన్ కార్యాలయ నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుదాం అన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గం పాల్గొన్న ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్, ఉపాధ్యక్షులు రమేశ్ హజారే, బిఆర్. లెనిన్, అబ్దుల్లా, ఆదినారాయణ, తెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, ఐజేయూ జాతీయ కార్యదర్శి రాజమౌళి చారి, కార్యవర్గ సభ్యులు అవ్వారీ భాస్కర్ లతో పాటు అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఏ.విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికయ్యారు. ప్రస్తుతం మెదక్ ఉమ్మడి జిల్లా టియూడబ్ల్యుజె నాయకులుగా కొనసాగుతున్న విష్ణువర్ధన్ రెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా ఈ సందర్భంగా ఎన్నికయ్యారు. ఆయనతోపాటు టియూడబ్ల్యూజె రాష్ట్ర కోశాధికారిగా పి.యోగానందం ఎన్నికయ్యారు. ఆయన ఇప్పటివరకు హైదరాబాద్ అధ్యక్షులుగా పనిచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News