కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ వెల్లడి
న్యూఢిల్లీ : టపాకాయలు నింపిన పండు తినడం వల్ల గర్భంతో ఉన్న ఏనుగు మృతి చెందడం ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ సోమవారం ప్రకటించింది. సైలెంట్ వ్యాలీ అడవుల్లో 15 ఏళ్ల ఏనుగు టపాకాయలు నింపిన అనాస పండును తినడంతో నోటిలోనే పేలుడు సంభవించింది. వారం తరువాత వెల్లియార్ నదిలో మే 27న మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించి కేరళ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని, నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించామని, ఏనుగు మృతికి పరోక్షకారకులైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామని పర్యావరణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఒకరు అరెస్టు అయ్యారని మిగతా నిందితులను కూడా అరెస్టు చేయడమౌతుందని వివరించింది. పంట పొలాలను జంతువుల బారి నుంచి కాపాడుకోడానికి స్థానికులు ఈ విధంగా పండ్లలో పేలుడు పదార్ధాలు నింపుతుంటారని ఇకపై ఇలాంటి అక్రమ చర్యలకు పాల్పడకుండా చూడాలని ఆదేశించినట్టు పేర్కొంది. ఈసంఘటన దర్యాప్తులో పురోగతి కోసం ఆదివారం నాడు మంత్రిత్వశాఖ అధికారులతో సమావేశం నిర్వహించింది.