జైపూర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజిఎన్ఆర్ఇజిఎస్) కింద తమ రాష్ట్రంలో 50లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్నామని, వారిలో13 లక్షలమంది వలస కార్మికులని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తెలిపారు. కరోనావైరస్ విజృంభణతో విధించిన లాక్డౌన్ వల్ల తమ రాష్ట్రంలో లక్షలమంది ఉపాధి కోల్పోయారని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఈ పథకం కింద 62,000మంది మాత్రమే ఉండగా, జూన్ 8కల్లా 50 లక్షల 20వేలమంది నమోదైనట్టు పైలట్ తెలిపారు. ఈ పథకం కింద భిల్వారా జిల్లాలో 4.11లక్షలమంది, దుంగార్పూర్ జిల్లాలో 3.55 లక్షలమంది, బన్స్వారా జిల్లాలో 3.50లక్షలమంది, అజ్మేర్ జిల్లాలో 2.67 లక్షలమంది ఉపాధి పొందుతున్నారని ఆయన తెలిపారు. వలస కార్మికుల్లో 11.50 లక్షలమందికి ఇప్పటికే జాబ్ కార్డులుండగా, 1.75 లక్షలమందికి కొత్తగా మంజూరు చేశామని ఆయన తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉపాధి కార్మికులకు జాగ్రత్తలు సూచించనున్నట్టు ఆయన తెలిపారు. రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.