Sunday, April 28, 2024

ఎక్కడ ఆరోగ్యంతో విరాజిల్లుతాం?

- Advertisement -
- Advertisement -

(ఈనాడు మనం 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర ఉత్సవం జరుపుకున్నాము. మన దేశంలో ఈనాడు వున్న పరిస్థితులు అందరూ ఎరిగినవే. ఆరోగ్య రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలలో అనేక విషయాలలో ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విషయంలో మనం వెనుకబడి ఉన్నాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సహస్రాబ్ది లక్ష్యాలను కూడా చేరుకోలేదు. అందరికీ ఆరోగ్యం అన్న లక్ష్యం ఇంకా సుదూరంగానే వుంది. అయితే కొన్ని అంశాలలో అంతర్జాతీయ స్థాయి వైద్యం అందిస్తున్నాము. ఫార్మా, వ్యాక్సిన్ ల రంగంలో ముందంజ వేశాము. కానీ మొత్తం మీద ఆరోగ్య రంగం అసమానతలతోవుంది. అత్యధిక ప్రజలకు అందుబాటులో లేదు. స్వాతంత్య్ర శత వార్షికోత్సవం నాటికైనా ఆరోగ్య రంగంలో ఈ పరిస్థితులు మెరుగుపడతాయా? ఒక ఆదర్శవంతమైన వ్యవస్థ ఎలా వుంటుంది? మనం ఎలా వుండాలి! అనే ఊహా చిత్రాన్ని గీశారు సౌమ్యా స్వామినాథన్. ఆమె ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థలో సీనియర్ సైంటిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మానవుడనే మూలధనానికి ఆరోగ్యం కీలకమైనదిగా గుర్తించబడిన చోట పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఈ ఊహా చిత్రం. మన చేతిలో కేవలం పాతిక సంవత్సరాలే ఉన్నాయి. ఆ కలను నిజం చేసుకోవటానికి ఆమె సూచించినట్లు నేటి నుండే ఆరోగ్య రంగంలో తగిన ప్రణాళికలతో కార్యాచరణ మొదలు పెట్టవలసి వుంది.)

ఈ సమాజానికి మానవుడే మూలధనం. మానవుని ఆరోగ్యం కీలకమైనదిగా గుర్తించబడిన చోటప్రజలు దీర్ఘకాలం జీవిస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. అన్ని ఆరోగ్య సేవలు, మంచి పోషకాహారం, పరిశుభ్రమైన గాలి, శుభ్రమైన మంచినీటిని పొందుతారు.మన జీవన నాణ్యత, ఆరోగ్యం మన పర్యావరణం నాణ్యతతోను, మన పక్కనే భూమి మీదా, నీటిలోను నివసించే అన్ని జాతుల ప్రాణుల ఆరోగ్యంతో పెనవేసుకుపోయాయనే గ్రహింపు పెరుగుతోంది. ఈ ఎరుక మనకు ప్రకృతితో సామరస్యంగా జీవించడంలోని ప్రాముఖ్యతను గుర్తు చేసింది.2047లో దేశం ఎలా ఉండాలో ఊహించుదాం. ఉత్తర భారతదేశంలో ఒక గ్రామం. అక్కడ ఆకాశం స్పష్టంగా, నీలంగా ఉంది. చలికాలం ఉదయపు గాలి శుభ్రంగా వీస్తున్నది. బహు తరాలు కలసి జీవిస్తున్న గ్రామీణ కుటుంబం బాగా వెలుతురు వచ్చే పక్కా ఇంటిలో నివసిస్తోంది. వారి ఇంటికి మరుగుదొడ్డి వుంది. స్నానశాల వుంది.
నిరంతరం పరిశుభ్రమైన నీటి సరఫరా వుంది. అన్ని ఇళ్ళకు సోలార్ ప్యానెల్స్ వున్నాయి. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్, స్థానిక గ్రిడ్‌తో సంధానం చేయబడింది.

వంట చెరకు, కట్టెలు లేక ఇతర ఘన ఇంధనాన్ని వంట కోసం ఉపయోగించాల్సిన రోజులు పోయాయి. ఇద్దరు పిల్లల ఆ తల్లి అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని విద్యుత్ పొయ్యిపై వండుతుంది. ఆమె భర్త పిల్లలను పాఠశాలకు సిద్ధం చేస్తాడు. సోలార్ బ్యాటరీతో నడిచే స్థానిక బస్సు పిల్లల్ని పాఠశాలకు, పెద్దవారిని వారి పని ప్రదేశాలకు తీసుకు వెళుతుంది. ఆవిడ భర్త స్థానిక పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నాడు. ఆమె ఒక క్లినికల్ నర్స్ ప్రాక్టీషనర్. ఆమె మరో సహోద్యోగి సుమారు 5,000 మందికి సేవలందించే ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్‌ని నడుపుతున్నారు. ఆమెకు అన్ని కుటుంబాలు తెలుసు. ప్రతి వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి రికార్డు ఆమె వద్ద ఉంది. ఆమె టాబ్లెట్ పరికరం, ఆమె రోజు చేయాల్సిన సందర్శనలను గుర్తు చేస్తుంది.ఆమె తీసుకెళ్లాల్సిన ఔషధాలు, ఇతర సప్లైల జాబితాను తెలియజేస్తుంది.

మొదట, ఆమె జిల్లా ఆసుపత్రిలోని డయాబెటిక్ స్పెషలిస్ట్‌తో ఒక గ్రూపు టెలికన్సల్టేషన్ నిర్వహిస్తుంది. సెంటర్ వద్ద ఆమె కోసం వేచి ఉన్న రోగుల సమూహాన్ని ఆమె కలుసుకుంటుంది. వారు అప్పటికే డయాగ్నోస్టిక్కియోస్క్ వద్ద స్వీయ -పరీక్షలు చేసుకున్నారు. ఫలితాలు వాళ్ళ చేతుల్లోనే వున్నాయి. వర్చువల్ కేర్ సంప్రదింపుల కోసం డాక్టర్ తెరపై వచ్చేశారు. ప్రతి వ్యక్తికి వారి ఆరోగ్య సూచికల (బిపి, బ్లడ్ షుగర్, బరువు వంటివి) గురించి రిపోర్ట్ చేయడానికి, ప్రశ్నలు అడగటానికి అవకాశం లభిస్తుంది. కొంత మంది ఫలితాలు బాగున్నాయి, మరికొందరికి వారి రక్తంలో చక్కెరపై సరైన నియంత్రణ లేదు, వారికి నిపుణుల నుండి తగిన సలహా అవసరం. తర్వాత పోషకాహార నిపుణుడు ఆరోగ్యకరమైన, అందుబాటులో వుండే వంటకాల గురించి చర్చించడానికి ఆన్‌లైన్‌లోకి వస్తాడు. రోగి ఇలా వున్న చోటు నుండి కదలకుండానే నిపుణుల సలహాలు పొందుతాడు.
తరువాత గృహ సందర్శనలు -గర్భిణీ స్త్రీలను, శిశువులకు పాలు కుడిపే తల్లులను తనిఖీ చేయడానికి, ఇమ్యూనైజేషన్ రికార్డులు తాజాగా ఉన్నాయా అని తనిఖీ చేయడానికి (కేవలం పిల్లలు మాత్రమే కాకుండా అన్ని వయస్సుల ప్రజలు టీకాలు పొందుతున్నారు), పిల్లలందరూ పాఠశాలలో ఉన్నారా లేదా ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా లేదా నిరాశకు గురవుతున్నారా అని పరిశీలిస్తారు. గ్రామంలోని పెద్దలందరికీ ఒక కేంద్రం వద్ద నెలవారీ రక్తపోటు తనిఖీలు చేస్తారు. ఆమె ఒక పోర్టబుల్ అల్ట్రాసోనిక్ పరికరాన్ని ఉపయోగించి ఎవరిలోనయిన కణుతులు ఏర్పడుతున్నాయా అని పరిశీలిస్తుంది. అలాగే మూత్రంలో బయోమార్కర్స్ పరీక్షించి కొన్ని రకాల కేన్సర్ వ్యాధుల కోసం స్క్రీనింగ్ చేస్తుంది. ఇలాటి పరీక్షల ద్వారా ఆమె అనేక కేన్సర్ కేసులను ప్రారంభ దశలోనే గుర్తించగలగటం వల్ల ఆ రోగులు పూర్తిగా వ్యాధి నుంచి విముక్తి పొందారు. ఈ విషయం ఆమెకు ఎంతో ఆనందదాయకం. అంతేకాదు వాటిని నయం చేసుకోవటానికి, చికిత్స పొందడానికి ఏ కుటుంబ భూమినో లేదా ఆభరణాలను విక్రయించాల్సిన అవసరం కలుగలేదు. క్షయ వ్యాధి చాలా అరుదైనదిగా మారినప్పటికీ, ఆమె ఇప్పటికీ దగ్గు లేదా జ్వరం ఉన్న ఎవరినైనా స్క్రీనింగ్ చేస్తుంది. ప్రజారోగ్యంలో ఆమె పొందిన శిక్షణ అంటే జ్వరం లేదా విరేచనాల వంటి లక్షణాలు సమూహంలో వ్యాపిస్తుంటే, ఆ అసాధారణ సంఘటనలను త్వరగా గమనించి, వాటిని జిల్లా ఎపిడెమియాలజిస్ట్‌కు నివేదిస్తుంది. ఇప్పుడు అక్కడ ఆడబిడ్డను కనడానికి ఇష్టపడని కుటుంబాన్ని ఆమె అత్యంత అరుదుగా మాత్రమే చూస్తుంది; మరి అక్షరాస్యత 100 శాతం వుంది.

వృద్ధులు, శారీరక వైకల్యాలు, చిత్త వైకల్యం ఉన్నవారు, అందరూ ఒక కమ్యూనిటీ సెంటర్‌కు వెళతారు, అక్కడ శిక్షణ పొందిన ఫిజియోథెరపిస్ట్, ఇద్దరు సహాయకులు వారిని చికిత్సలో నిమగ్నం చేస్తారు. పని చేసే మహిళలు తమ పిల్లలను విడిచిపెట్టడానికి క్రెచ్ అతి సమీపంలోనే వుంటుంది. వారు శారీరక సంరక్షణ, అభిజ్ఞా ఉద్దీపన, ఆట ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. చాలా తరచుగా, పిల్లలు పెద్దల సంరక్షణ గృహాలకు వస్తారు. అప్పుడు పెద్దా, చిట్టి తరాల మధ్య సంతోషకరమైన కలయిక ఏర్పడుతుంది. భారత దేశంలో ఆయుర్దాయం ఇప్పుడు 80 సంవత్సరాలు దాటినప్పటికీ, వ్యాధి నివారణ, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించడం వల్ల ప్రజలు ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఆరోగ్య సంరక్షణ భావన (ఉద్దేశం) మారింది. ప్రభుత్వం క్లినికల్ కేర్, సేవల పంపిణీలో మాత్రమే కాకుండా, పరిశుభ్రమైన నీరు, గాలి, ఆకుపచ్చ పరిసరాలు, ప్రజా రవాణా, ఆరోగ్యకరమైన ఆహారం వంటి ఉన్నత శ్రేణి ఆరోగ్య నిర్ణాయకాలపై చాలా ఎక్కువ పెట్టుబడి పెడుతుంది. మానవ వనరు ఆర్థికాభివృద్ధికి ఒక మూలధనం అందువల్ల మానవ ఆరోగ్యం కీలకమైనదిగా గుర్తించబడింది.

వ్యవసాయ ఉత్పాదకతలో విపరీతమైన పెరుగుదల, పంటల వైవిధ్యత కారణంగా, పిడిఎస్ (ప్రజా పంపిణీ వ్యవస్థ) ద్వారా వివిధ రకాల చిరు ధాన్యాలు, తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు కావలసినంతగా లభిస్తాయి.గ్రామాలలో పోషణ తోటలు కూడా వుంటాయి. అన్ని కుటుంబాలు పండ్లు, కూరగాయలు ప్రోటీన్‌లు తగినంత భాగాలతో రోజుకు మూడు సార్లు ఆరోగ్యకరమైన భోజనాన్ని తీసుకోగలుగుతాయి.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారానికి ఏడు రోజులు పని చేస్తుంది. చాలా మంది నిపుణుల సలహా సంప్రదింపులు టెలి-హెల్త్ ద్వారా లభ్యమవుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో ఉన్న రోగుల కొరకు, ఔషధాలు (పోస్ట్ మ్యాన్ ద్వారా) ఇంటికే సరఫరా చేయబడుతాయి. రోగులు తమ మొబైల్ ఫోన్లతోఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను అప్‌డేట్ చేసుకోగలుగుతారు. ఔషధాలు, డయాగ్నోస్టిక్స్, వ్యాక్సిన్లు, వైద్య పరికరాల్లో భారతదేశం స్వయం సమృద్ధి సాధిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలను అసమానంగా ప్రభావితం చేసే వ్యాధులపై పరిశోధన, అభివృద్ధి కృషిపై కేంద్రీకరించే అనేక ప్రపంచ, ప్రాంతీయ కన్సోర్షియాలో దేశం భాగం అవుతుంది.

జన్యు మార్కర్ల ఆధారంగా కేన్సర్ కొరకు లక్ష్యిత, వ్యక్తిగతీకరించబడ్డ చికిత్సలు (మోనోక్లోనల్ యాంటీబాడీలు), వంశపారంపర్య వ్యాధుల కొరకు క్రిస్పర్ జన్యు చికిత్సలు అనేక కేంద్రాల్లో లభ్యం అవుతాయి. ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కృషి ఫలమిస్తే చాలా మంది పౌరులు తమ ఆరోగ్య డేటాను ప్రభుత్వంతో పంచుకుంటారు. అది అనేక సదుపాయాలకు నెలవు అవుతుంది. తద్వారా వివిధ కమ్యూనిటీల్లో వ్యాధి భారం, ప్రమాద కారకాల వివరాలు (డేటా) లభ్యమవుతుంది. దాని రియల్ టైమ్ విశ్లేషణలు విధాన రూపకల్పనను ప్రభావితం చేస్తాయి. జాతీయ ఆరోగ్య అసెంబ్లీ ప్రతి సంవత్సరం సమావేశమవుతుంది, ప్రాధాన్యతా ఆరోగ్య అంశాలపై చర్చించడానికి, పరిష్కారాలను కనుగొనడానికి అన్ని రాష్ట్రాల నుండి ప్రతినిధులు వస్తారు. ఈ భాగస్వామ్య అభ్యాసం భారత దేశానికి స్వాతం త్య్రం వచ్చిన 75వ సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి నుండి పరస్పరం గౌరవప్రదమైన, ప్రయోజనకరమైన,సుసంపన్నమైన సంభాషణగా పరిణతి చెందింది. పాతతరం తరచుగా 2020-21 మహమ్మారి సంవత్సరాల గురించి, అప్పుడు ప్రతిదీ ఎంత భయానకంగా ఉండేదో, ఆ అనుభవం తర్వాత ఆరోగ్యం పట్ల విధానం నాటకీయంగా ఎలా మారిందో మాట్లాదుతుంది.

ఆ పెద్ద షాక్ తరువాత, ఆరోగ్య అక్షరాస్యత మెరుగుపడింది -కొవిడ్ తో మరణించిన వారిలో చాలా మందికి అధిక రక్తపోటు, ఊబకాయం లేదా మధుమేహం అంతర్లీనంగా ఉన్నాయి. ప్రజలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ , నాన్- కమ్యూనికబుల్ (ఆసాంక్రమిక) వ్యాధుల నివారణ అవసరాన్ని మరింతగా పట్టించుకున్నారు. మన జీవన నాణ్యత మన పర్యావరణం ఆరోగ్యంతో, మన పక్కన భూమిపై, నీటిలో నివసించే అన్ని జాతులు (ఒకే ఆరోగ్యం) తో పెనవేసుకుపోయాయనే గ్రహింపు పెరిగింది. ప్రకృతితో సామరస్యంగా జీవించడం ప్రాముఖ్యతను గుర్తు చేసింది. మనకు తెలిసిన అతి పురాతన గ్రంధమైన ఋగ్వేదం ఇలా చెబుతుంది: ‘మలయ మందానిలాలు సాగుగాక/ తీపి నీటి నదులు ప్రవహించుగాక/ మధురమైన మూలికలు మనకు అందుబాటులో ఉండుగాక/రాత్రులు, పగలు సుఖాన్ని ప్రసాదించుగాక/ భూమి ధూళి మనకు సంతోషాన్ని ప్రసాదించుగాక’ప్రకృతి- ప్రాణుల అనుబంధం ఆరోగ్యానికి ప్రాతిపదిక అని మానవ జాతి నేర్చుకున్న అమూల్యమైన పాఠం.

డా.యస్. జతిన్ కుమార్
9849806281

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News