Sunday, May 5, 2024

సింగరేణి సంస్థపై చర్చకు తాము సిద్ధం : ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై బిఆర్‌ఎస్ పదే పదే విషం చిమ్ముతోందని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసే ఆలోచన తమకు లేదని రామగుండం గడ్డ మీద నుంచి ప్రధాని మోడీ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సింగరేణి విధి విధానాలపై కేంద్రం జోక్యం చేసుకోవట్లేదని.. రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసిందని చెప్పారు. సింగరేణి ప్రైవేట్ పరం చేస్తారని బిఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలపై చర్చకు సిద్ధమన్నారు. తేదీ చెబితే తాము చర్చకు వస్తానని బిఆర్‌ఎస్‌కు ఆయన సవాల్ విసిరారు.‘బొగ్గు గనులకు దరఖాస్తు చేసుకోకుండా కేంద్రంపై బిఆర్‌ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. సింగరేణిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. సింగరేణిలో మూడు గనులు ప్రైవేట్‌కు ఇచ్చి తవ్విస్తున్నది నిజం కాదా? రూ.320 కోట్ల బకాయిలు సింగరేణికి ఎందుకివ్వడం లేదు? విశాఖ గురించి అలోచిస్తున్న కెసిఆర్.. ముందు రాష్ట్రానికి న్యాయం చేయాలి.

ఆర్టీసీ, నిజాం షుగర్, అజాంజాహి మిల్లు తెలంగాణవి కాదా? రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సింగరేణి ప్రైవేట్ పరం చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేంద్రం కోల్ మైన్స్ ప్రైవేట్ పరం చేస్తోందని చెప్పిన మాట వంద శాతం తప్పు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి 51 మిలియన్ టన్నుల నుంచి 64 టన్నుల కు బొగ్గు ఉత్పత్తి పెరిగిందన్నారు. కార్మికుల సంఖ్య మాత్రం 63 వేల నుంచి 43వేలకు తగ్గిందన్నారు. తాడిచెర్ల ఓపెన్ మైన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రైవేట్ పరం చేసిందన్నారు. మొత్తం మైన్స్‌లో తాడిచెర్ల ఓపెన్ మైన్స్ నాణ్యత గల బొగ్గు ఉందన్నారు. నైనీలో సింగరేణికి టెండర్ దక్కిన బొగ్గు తీసేది మాత్రం ప్రైవేట్ సంస్థ అన్నారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి రూ.25 కోట్లు బిఆర్‌ఎస్ నేతలు ఇచ్చారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ఒకే నాణేనికి ఉన్న బొమ్మ, బొరుసు.

ఎన్నికల ముందో. తరువాతో ఆ రెండు పార్టీలు కలుస్తాయి‘ అని ఈటల వ్యాఖ్యానించారు. ఆర్టీసీ లాభాల కోసం పెట్టిన సంస్థ కాదు బస్సులన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు ఎక్కడో ఉండే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచిస్తున్నారు కానీ ప్రజలకు ఉపయోగపడే ఆర్టీసీ నీ మాత్రం గాలికి వదిలేస్తున్నారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ వంటివి వాటిని పునరుద్ధరించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. పేదల అసైన్డ్ భూములను లాక్కొని వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారం రూపంలో అమ్ముకుంటున్నారని విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర బిజెపి నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News