కొండపోచమ్మ సాగర్లోకి గోదావరి జలాల తరలింపు ప్రక్రియకు నేడు ట్రయల్ రన్
సాగునీటి రంగంలో మరో అద్భుత ఘట్టానికి సర్వం సిద్ధం
15 టిఎంసిల సామర్థ్యంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణం
కనిష్టంగా 400 చెరువులు నింపే ప్రణాళిక
మన తెలంగాణ/హైదరాబాద్ : సాగునీటి రంగంలో మరో అద్భుతం ఆవిష్కారానికి సిద్ధమైంది. ఇందుకు ఈ నెల 11వ తేదీ నాంది పలుకనుంది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాల తరలింపు ప్రక్రియ ప్రారంకానుంది. ఇప్పటి వరకు మిడ్మానేరుకు పరిమితమైన గోదావరి జలాలకు 510 మీటర్ల ఎత్తులో నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్కు గోదావరి జలాలు చేరనున్నాయి. మిడ్మానేరు నుంచి దాని దిగువన ఉన్న పంపుల ద్వారా కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని ఎత్తిపోసే ట్రయల్న్ పనులు లాంఛనంగా మరో 24 గంటల్లో ప్రారంభం కానున్నా యి. కాళేశ్వరం ప్రాజెక్టు4వ లింక్, 14వ ప్యాకేజిలో 15 టిఎంసి సామర్థంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును సుమారు రూ.17వందల కోట్ల అం చనా వ్యయంతో అనేక అవాంతరాలను అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం కొండపోచమ్మ సాగర్ను వలయాకారంలో నిర్మిస్తోంది.
అనంతగిరి, రంగనాయక్సాగర్ రిజర్వాయర్లను నింపుతూ, మల్లన్నసాగర్ ఫీడర్ చానల్ ద్వారా గోదావరి నీటిని గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మకు తరలిస్తున్నారు. అయితే ఈ గోదావరి జలాలు కొండపోచమ్మసాగర్కు చేరితే అద్భుతమేనని జల నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో 88 మీటర్ల బెడ్లెవల్ నుంచి గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ నీటిని 618 మీటర్ల ఎత్తు న ఉన్న కొండపోచమ్మకు తరలిస్తే 530 మీట ర్ల మేర నీటిని తరలించినట్టవుతుంది. మేడిగడ్డ నుంచి కొండపోచమ్మకు సుమారు 200 కిలోమీటర్లు ప్రయాణం చేయనుందని, ఈ ప్రయాణానికి మొత్తంగా 10 స్టేజీలలో నీటి ఎత్తిపోతల పూర్తికానుందని చెప్పారు. మిడ్ మానేరు దిగువన 4వ దశలో 5 ప్యాకేజీలు ఉండగా, 76 కి.మీ. గ్రావిటి కెనాల్, 32.42 కి.మీ. టన్నెళ్లు దాటుకొని 5 పంప్హౌస్ల ద్వారా నీరు కొండపోచమ్మకు చేరనుంది.
మిడ్మానేరు కింద కొండపోచమ్మ సాగర్ వరకు 50 కిలోమీటర్ల ప్రధాన కెనాల్ పరిధిలో ప్యాకేజీ-10, 11, 12, 13, 14 ప్యాకేజీలు ఉండగా, ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్యాకేజీ-10లో అప్రోచ్ చానల్, గ్రావిటీ కెనాల్ ఇతర నిర్మాణాలతో పాటు 7.65 కిలోమీటర్ల టన్నెల్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇక్కడ 4 మోటార్లు అమర్చాల్సి ఉండగా అవి కూడా పూర్తయ్యాయి. 3.5 టిఎంసిల అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. ప్యాకేజీ-11లో అన్ని పను లు పూర్తవగా, 8.41 కిలోమీటర్ల టన్నెల్ పనులు, లైనింగ్ పనులు రికార్డు సమయంలో పూర్తి చేశారు. ఇక్కడ 4 మోటార్లలో అన్నీ సిధ్ధమయ్యాయి. ఇదే ప్యాకేజీలో ఉన్న కొమరవెల్లి మల్లన్న సాగర్ పనులు ఇప్పుడే మొదలయ్యాయి. ఇక్కడ భూసేకరణ సమస్యగా ఉండటంతో రిజర్వాయర్ పనులు పూర్తి కాకున్నా 18 కిలోమీటర్ల మేర ఫీడర్ చానల్ ద్వారా 15 టిఎంసిల సామర్ధ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్కు తరలించేలా ఏర్పాట్లు చేశారు. కనిష్టంగా 400 చెరువులు నింపేలా ప్రణాళికను పెట్టుకున్నారు.
కాగా ఈ రిజర్వాయర్ ఉమ్మడి మెదక్ జిల్లాలతో పాటు యాదాద్రి, భువనగిరి, మేడ్చల్ జిల్లాలకు గోదావరి జలాలను అందించనుంది. 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారా అందనుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ తాగునీటి సౌకర్యం మరింత మెరుగు పడనుంది. ఐదు జిల్లాల పరిధిలోని గజ్వేల్, దుబ్బాక, భువనగిరి, నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి, పటాన్చెరు, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లోని 26 మండలాలకు కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి గోదావరి నీరు ప్రవహించనుంది. అలాగే తుర్కపల్లి, జగదేవ్పూర్, ఉప్పరపల్లి కాల్వలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి విపక్షాలు అనేక అవాంతరాలను సృష్టించినా, భూసేకరణకు అడ్డుగా నిలిచినా ప్రభుత్వం రైతుల మద్దతుతో 4,700 ఎకరాల భూమిని సేకరించి ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ములుగు మండలంలోని తానేదార్పల్లి, మామిడాల, బైలాంపూర్ ముంపునకు గురికాగా ప్రభుత్వం వారిని ఆదుకుని ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచింది. అయితే ఈ రిజర్వాయర్కు మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 21.335 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా పంపించాలని మాస్టర్ ప్లాన్ రూపొందించినప్పటికీ మల్లన్నసాగర్ నిర్మాణ దశలో ఉండటంతో ఈ విధానాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం రంగనాయక సాగర్ భూగర్భ సొరంగం నుంచి తుక్కాపూర్లో నిర్మించిన సర్జిపూల్కు గోదావరి జాలాలను విడుదల చేశారు. అక్కడి నుంచి గజ్వేల్ మండలంలో నిర్మించిన పంప్ హౌజ్కు నీటి తరలించి అక్కడి నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్లోకి భారీ పంపులతో ఎత్తి పోస్తారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఈ విధానం ఓ తార్కాణంగా నిలిచి పోతుంది.
వలయాకార నిర్మాణం ఓ అద్భుత దృశ్యం
కాకతీయ రాజుల నుంచి కుతుబ్షాహీ, ఆసఫ్జాహీ రాజుల వరకు రిజర్వాయర్లు, చెరువుల నిర్మాణాల్లో ఇంజనీరింగ్ నైపుణ్యతతో పాటుగా ఆకారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కాకతీయులు నిర్మించిన అనేక రిజర్వాయర్లు, చెరువుల్లో ఈ విధానం అగుపిస్తోంది. కుతుబ్షాహీలు నిర్మించిన మిరాలం ట్యాంక్ అర ్థచంద్రాకారంలో ఉండగా, హుస్సేన్సాగర్ హృదయం మాదిరిగా ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ఈ ప్రాజెక్టు ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో వలయాకారంలో నిర్మించి తరతరాల సంప్రదాయాన్ని పునరుద్ధరించారు. వలయాకారానికి మూడుపంపు హౌజ్లను ఏర్పాటు చేశారు. ఈ పంపు హౌజ్ల నుంచి ఎనిమిది ప్రధాన కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తారు. 135 కిలోమీటర్ల పరిధిలో నీటిని కాల్వల ద్వారా వినియోగించుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ను తీర్చిదిద్దారు.