అప్పుడే పుట్టిన శిశువు, ఏడాది బాబుని బలితీసుకున్న మహామ్మారి
మరణించిన 25 మందిలో 18 మంది మర్కజ్లింక్ వారే
మన తెలంగాణ/హైదరాబాద్ : ఇప్పటి వరకు రాష్ట్రంలో సంభవించిన కరోనా మరణాల్లో యభై వయస్సు దాటిన వారే ఎక్కువ మంది ఉన్నారని వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. వీరిలో 18 మంది మర్కజ్ లింక్ నుంచి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. కరోనాకి తోడు వీరికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటం వలనే మరణాలు సంభవించాయని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో (మంగళవారం బులిటెన్ ప్రకారం)25 మంది చనిపోగా, వారిలో ఇద్దరు గుల్బర్గకు చెందిన వారు కాగా, మరోకరు ఏపిలో నివసించే వ్యక్తిగా అధికారులు పేర్కొన్నారు. అయితే వారు బంధువుల ఇంటికి వచ్చిన క్రమంలో అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో హైదరాబాద్ అడ్రస్ను నమోదు చేశారు. చివరికి చికిత్స పొందుతూ వారు చనిపోగా వాళ్లను కూడా తెలంగాణ కరోనా మరణంగానే పరిగణించామని ప్రజారోగ్యసంచాలకులు డా శ్రీనివాసరావు తెలిపారు.
కరోనాకి బలైన అప్పుడే పుట్టిన చిన్నారి, ఏడాది బాబు…..
కరోనా మహామ్మారి అప్పుడే పుట్టిన శిశువు, ఏడాది బాబుని బలితీసుకుంది. వీళ్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలనే మరణం సంభవించిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన 25 కరోనా మరణాల్లో 20 మందికి 50కి పైనే వయస్సు ఉండగా, మిగతా ముగ్గురు 35 నుంచి 50 మధ్య వయస్కులు ఉన్నారు. అయితే వీరిలో కరోనా సోకకముందే హైపర్ టెన్షన్, డయాబెటిస్ కల్గి 18 మంది ఉన్నారు. దీంతో పాటు 35 ఏళ్లు కలిగిన ఓ మహిళ క్యాన్సర్తో ,మరో ముగ్గురు శ్వాసకోశ సంబంధింత సమస్యలు, మరొకరు న్యూమోనియాతో బాధపడుతూ చనిపోయారని అధికారులు ప్రకటించారు. కరోనా సోకిన వాళ్లకు ఇతర రోగాలు జతకలవడం వలనే మరణాలు సంభవించాయని అధికారులు మరోసారి పేర్కొన్నారు.