Sunday, April 28, 2024

కోర మీసాల మల్లన్నకు స్వర్ణ కిరీటం

- Advertisement -
- Advertisement -

మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఘనంగా స్వామి కల్యాణం
ప్రభుత్వం తరఫున బంగారు కిరీటం అందజేసిన మంత్రి హరీశ్
వేదమంత్రాల సాక్షిగా గొల్ల కేతమ్మ, బిలిజే మేడలమ్మలకు తాళికట్టిన మల్లన్న
ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన మంత్రులు హరీశ్, తలసాని
రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు

కొమురవెల్లి: తెలంగాణ రాష్ట్రం కొంగు బంగారం.. కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణం వేడుక భక్తజనం చెంత ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. తోటబావి ప్రాంగణంలోని కల్యాణ మండపంలో ఆగమ శాస్త్ర ప్రకారం బలిజే మేడలమ్మ, గొల్ల కేతమ్మలను వేద మంత్రాల సాక్షిగా మల్లన్న కల్యాణమాడాడు. స్వామి కల్యాణానికి మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మల్లన్నకు ప్రభుత్వం తరఫున కోటి రూపాయల విలువైన బంగారు కిరీటాని అందజేశారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కొమురవెళ్లి మల్లన్న మన కొంగు బంగారమని, రాష్ట్రానికే తలమానికం మల్లన్న జాతర అని కొనియాడారు.

మల్లన్న కల్యాణం వైభవంగా జరగడం, స్వామివారికి బంగారు కిరీట ధారణ చేయడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ పురాతన ఆలయాలకు నిధులు మంజూరు చేస్తూ వాటికి పూర్వ వైభవం తెస్తున్నారన్నారు. చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం వైభవంగా జరిగిందన్నారు. సిఎం కెసిఆర్ కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధికి రూ.30కోట్లు కేటాయించారని, ఇప్పటికే కెసిఆర్ మల్లన్నను రెండుసార్లు దర్శించుకున్నారని, వచ్చే ఏడాది మల్లన్న కల్యాణం నాటికి కేతమ్మ, మేడలమ్మ అమ్మవార్లకు స్వర్ణ కిరీటాలు తయారు చేయిస్తామన్నారు.

కొందరు ఎన్ని కుట్రలు చేసిన మల్లన్న దయతో మల్లన్న సాగర్ అనుకున్న సమయానికి పూర్తి చేసుకున్నామని హరీశ్ అన్నారు. సిఎం కెసిఆర్ కృషితో మూడేళ్లలో మల్లన్న సాగర్ పూర్తిచేసుకొని, పలు జిల్లాలను సాగునీటితో సస్యశ్యామలం చేయడం జరిగిందన్నారు. మల్లన్న సాగర్ ప్రారంభం చేసి గోదావరి జలాలతో సిఎం కెసిఆర్ మల్లన్న పాదాలు కడిగి మొక్కులు తీర్చుకున్నారన్నారు. రూ.11కోట్లతో భక్తులకు కావల్సిన క్యూలైన్లు, 50 గదులతో సత్రం, కోనేరు, దేవాలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News