Friday, April 26, 2024

ఢిల్లీలో గవర్నర్ రాజకీయ వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన గవర్నర్ తమిళిసై సోమవారం ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన అనంతరం గవర్నర్ రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సిఎం కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదన్నారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యంతోనే ప్రధాని నరేంద్రమోడీని తరుచూ కెసిఆర్ విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇటీవల రాజ్‌భవన్‌లో సిఎం కెసిఆర్ తనను కలిసిన తర్వాత కూడా ప్రొటోకాల్‌లో ఎలాంటి మార్పురాలేదని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా గవర్నర్ చెప్పా రు. ఇటీవల తెలంగాణలో వరదలు వచ్చినప్పడు తాను స్వయంగా భద్రాచలంలో పర్యటించానని…ఆ సమయంలో కూడా కలెక్టర్ తన పర్యటనకు రాలేదన్నారు. ఈ విషయంలో తాను పెద్దగా పట్టించుకోనని ఆమె స్పష్టం చేశారు. గవర్నర్‌గా రాజ్‌భవన్‌కే పరిమితం కావడం తనకు ఇష్టం లేదన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటమే తన లక్ష్యమన్నారు.

తోచిన రీతిలో సా యం అందిస్తానన్నారు. తాను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటానని తమిళిసై స్పష్టం చేశారు. అందుకే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించానని వెల్లడించారు.మహిళా రాష్ట్రపతి కింద మహిళా గవర్నర్‌గా పని చేయడం తనకు ఆనందంగా ఉందని తమిళిసై అన్నారు. కింది స్థాయి నుంచి వ చ్చిన ఒక మహిళ.. దేశానికి రాష్ట్రపతి కావడం భారతదేశంలోనే సాధ్యమైందన్నారు. ఇతర రాష్ట్రాల గవర్నర్లతో తాను పోల్చుకోనన్నారు. రాష్ట్రంలో నెలకొన్న వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చినట్టుగా మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో వరదలపై రాజకీయం చేయడం మంచిది కాదన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెలంగాణ వచ్చినట్టుగా తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిధులకు సంబంధించిన వివరాలు ఇచ్చారన్నారు. వరదలకు క్లౌడ్‌బస్టర్ కారణమని సిఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై తాను బరెస్ట్ కానని తమిళిసై అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News