Tuesday, May 7, 2024

గ్రూప్ 4 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: జిల్లాలో జులై 1న నిర్వహించే గ్రూప్ 4 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి సజావుగా నిర్వహించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ దివాకరతో కలిసి జిల్లాలో జులై1న నిర్వహించు గ్రూప్4 పరీక్ష సన్నద్ధ్దతపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జులై 1న టిఎస్‌పిఎస్‌సి ద్వారా నిర్వహించే గ్రూప్4 పరీక్షలకు జిల్లాలో టిఎస్‌పిఎస్‌సి నియమ,నిబంధనల మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి అభ్యర్థులు సజావుగా పరీక్షలు రాసే విధంగా చూడాలని, ఇందుకు గాను అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేసుకోవాలని తెలిపారు.

జులై 1న ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు రెండవ పేపర్ పరీక్ష ఉంటుందని, జిల్లాలో 29 సెంటర్లలో మొత్తం 7482 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. టిఎస్‌పిఎస్‌సి గైడ్‌లైన్స్‌ను ప్రతి ఒక్కరూ చదివి నిబంధనలు పాటించాలని, లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటిండెంట్‌లు పరీక్ష కేంద్రాలను ముందస్తుగా సదర్శించి త్రాగునీటి, విద్యుత్, సీటింగ్, సిసి కెమెరాల ఏర్పాటును, ఇతర మౌలిక వసతులను సరి చూసుకోవాలని సూచించారు. పరీక్ష రోజు పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో జీరాక్స్ సెంటర్‌లను మూసివేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు.

పరీక్షా కేంద్రాల వద్ద సెల్‌ఫోన్ వంటి పరికరాలు భద్రపరచుకునేందుకు ఏర్పాట్లు చేయాలని, అభ్యర్థులను చెక్ చేసేందుకు పురుషులకు, మహిళలకు ప్రత్యేకంగా సిబ్బంది ఉండాలని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌తో పాటు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఒరిజినల్ తీసుకొని రావాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న పరీక్ష కేంద్రాలకు ప్రశ్నా పత్రాలను పోలీసుల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్ నుండి నిబంధనలు పాటిస్తూ తరించాలని అన్నారు. గ్రూప్ 4 ప్రశ్నాపత్రాల కవర్‌ను ఉదయం 9.30గంటలకు, మధ్యాహ్నం 2గంటలకు చీఫ్ సూపరింటిడెంట్ సమక్షంలో ఓపెన్ చేయాలని, పరీక్ష ప్రారంభానికి ముందే ఇన్విజిలేటర్లు ప్రతి అభ్యయర్థి తమకు కేటాయించిన సీటులో కూర్చున్నారో లేదో చెక్ చేసుకోవాలని, ప్రతి అభ్యర్థికి నిర్ధేశించిన జవాబుపత్రం, ప్రశ్నాపత్రం అందజేయాలని కలెక్టర్ తెలిపారు.

ముందుగా అదనపు కలెక్టర్ దివాకర, చీఫ్ సూపరింటిండెంట్, లైజనింగ్ అధికారులు, రూట్ అధికారులు పరీక్షరోజు చేయాల్సిన విధి, విధానాలను క్షుణ్ణంగా వివరించారు. పరీక్ష కేంద్రాల్లో సీటింగ్, రూమ్ వారీగా అభ్యర్థుల కేటాయింపు, దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే గదులు కేటాయించాలని, చీఫ్ సూపరింటిండెంట్ రూమ్‌లో సిసి కెమెరాలు ఏర్పాటు తదితర అంశాలు పకడ్బందీగా జరగాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్‌పి శ్రీనివాసులు, చీఫ్ సూపరింటిండెంట్‌లు, లైజనింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, ఎంపిఓలు, కలెక్టరేట్ ఏవో, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

గ్రూప్4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు
1. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం గుర్తించిన ఫొటో ఐడెంటిటి కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి
2. హాల్ టికెట్‌పై అభ్యర్థి సంతకం, ఫోటో స్పష్టంగా తెలియాలి. అభ్యర్థులు హాల్ టికెట్‌పై ఫోటో, సంతకం చెక్ చేసుకోవాలి, హాల్ టికెట్‌పై ఫోటో సరిగ్గా లేని పక్షంలో గెజిటెడ్ అధికారిచే ధృవీకరించిన 3 పాస్‌ఫోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని రావాలని, లేని పక్షంలో పరీక్షకు హాజరు కాలేరన్నారు.
3. ఉదయం 8గంటల నుండి 9.45గంటల వరకు, మధ్యాహ్నం 1గంటల నుండి 2.15గంటల వరకు పరీక్ష సెంటర్‌లోనికి అభ్యర్థులకు అనుమతి ఉంటుందని, సమయం దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదని, అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షా సమయానికి ముందస్తుగా వచ్చి ప్రశాంతంగా పరీక్ష రాయాలి. పరీక్ష కేంద్రంలో కేసులు అభ్యర్థులు ముందస్తుగానే చెక్ చేసుకోవాలి
4. అభ్యర్థులు తమ వెంట ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌ఫోన్, బ్లూటూత్, క్యాలిక్యూలేటర్ మ్యాథ్స్ లాంగ్ టెబుల్, పెన్ డ్రైవ్, చార్టర్స్, రైటింగ్ ప్యాడ్స్, నోట్స్, ఇతర గాడ్జెట్స్ తీసుకొని రావద్దని, అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకోవాలని, షూ వేసుకోరాదని తెలిపారు
5. అభ్యర్థులు ఓఎంఆర్ షిట్‌పై సూచనలు చదవాలని, హాల్ టికెట్ నెంబర్, ప్రశ్నాపత్రం నెంబర్ సరిగ్గా నమోదు చేయాలని, ప్రశ్నాపత్రంలో 150 ప్రశ్నలను సరిచూసుకోవాలని, 150 ప్రశ్నలు లేకపోతే వెంటనే ఇన్విజిలేటర్‌కు సమాచారం అందించాలి.
6. ఓఎంఆర్ షిట్‌పై బ్లూ, బ్లాక్ బాల్ పెయింట్ పెన్ మాత్రమే వాడాలని ఇంక్ పెన్ను, జెల్ పెన్, పెన్సిల్ వాడరాదు
7. పరీక్ష ప్రారంభానికి ముందు, ముగిసే సమయంలో లాంగ్‌బెల్ మోగుతుంది. పరీక్ష హాల్‌లో ప్రతి అరగంటకు ఒకసారి బెల్ మోగుతుందని, పరీక్ష ప్రారంభమైన అరగంటకు 1బెల్, గంటకు 2బెల్స్, గంటన్నరకు 3బెల్స్, 2గంటలకు 4బెల్స్, 2 గంటల 25 నిముషాలకు వార్నింగ్ బెల్ మోగుతుందని, దీనికి అనుగుణంగా అభ్యర్థులు పరీక్ష రాయాలన్నారు.
8.ఓఎంఆర్ షిట్‌పై అభ్యర్థులు తమ సంతకం చేసి ఇన్విజిలేటర్ సంతకం తప్పక తీసుకోవాలి
9. అభ్యర్థులు ప్రశ్నాపత్రంపై ఎలాంటి రాతలు సమాధానాలు మార్క్ రాదు
10. ఓఎంఆర్ షిట్‌పై అభ్యర్థి పొరపాటు చేస్తే దానిని మరో ఓఎంఆర్ షీట్‌తో భర్తీ చేయడానికి వీలు లేదు.
11. పరీక్ష ముగిసిన తర్వాత అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ అప్పజెప్పిన తర్వాత ఎడమచేతి బొటనవేలు థంట్ బయోమెట్రిక్ ఇవ్వాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News