హైదరాబాద్: నగరంలో పర్యటిస్తున్న యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)కు చెందిన జర్నలిస్టులు, ఎడిటర్లతో కూడిన బృందం శుక్రవారం శంషాబాద్లోని ఏరోస్పేస్ పార్క్ను సందర్శించింది. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఈ బృందం హైదరాబాద్లో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఈ బృందం ఏరోస్పేస్ పార్క్ను సందర్శించి, పార్క్లోని విమానాల విడిభాగాల అమరిక, మరమ్మతు పనులు, నిర్వహణ సామగ్రిని పనితీరును పరిశీలించింది. పార్క్లోని ఎయిర్స్పేస్ విశేషాలను జిఎంఆర్ సంబంధిత అధికారి సౌరబ్ జైన్ వివరించారు. అంతకు ముందు ఈ బృందం గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బి)ను సందర్శించింది.
స్కూల్ అకాడమిక్ విశేషాలు, నియామక ప్రక్రియ, విద్యార్థు లకు అందిస్తున్న సేవలు, బిజినెస్ రంగంలో స్కూల్ ప్రాధాన్యతను సంబంధిత ఐఎస్బి ప్రతినిధి గురు బృందానికి తెలియజేశారు. అనంతరం టిసిఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ) సినర్జీ పార్క్ను సందర్శించింది. ఐటి రంగంలో టిసిఎస్ చేస్తున్న కృషి, నియామకాలు, స్టార్టప్లకు ఇస్తున్న ప్రోత్సాహం, ఐటి సేవల గురించి టిసిఎస్ ఆపరేషన్స్ హెడ్ రాజు ఈ బృందానికి వివరించారు.
మీడియా అకాడమీ అఫ్ తెలంగాణ సెక్రటరీ విజయ గోపాల్ , సమా చార, పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి.శ్రీనివాస్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు దేవేందర్ కుమార్, సుధాంశ్ కుమార్, సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారి బాజ్పేయ్, యూకేకు చెందిన ఏడుగురు జర్నలిస్టులు, ఎడిటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు రోజుల పర్యటన అనంతరం శుక్రవారం రాత్రి ఈ బృందం తిరిగి ఢిల్లీ వెళ్లింది.