Tuesday, April 30, 2024

కెసిఆర్ సార్ అని అడిగితే.. నీళ్ళు వస్తున్నాయి: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సమైక్య రాష్ట్రంలో సాగునీటి కోసం మొగులు వైపు ఆర్తిగా కళ్ళు పెట్టి చూడాల్సిన పరిస్థితి ఉంటే.. స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగు నీరు విడుదల కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వైపు చూసి నీళ్లు కావాలని అడిగితే.. నీళ్ళు వస్తున్నాయని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద కొమురవెల్లి మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలను యాదాద్రి భువనగిరి జిల్లాలోని గండి చెరువు (ప్యాకేజీ 15 కాలువ ద్వారా)కు, ఆ వెంటనే కొండ పోచమ్మ కాలువ ద్వారా కూడవెళ్లి వాగులోకి గోదావరి జలాలను మంత్రి హరీష్ రావు, పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మండుటెండల్లో కుడవెళ్లి వాగులోకి, అట్లాగే ప్యాకేజీ 16 కాలువలోకి సాగునీరును విడుదల చేయడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. త్రాగునీటికి గోసపడ్డ ప్రాంతంలో నిండు వేసవిలో గోదావరి జలాలను వాగుల్లోకి, కాలువల్లోకి సమృద్ధిగా విడుదల చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కుతుందని అన్నారు. నిండు వేసవిలో కాల్వల్లో గోదావరి జలాలు పారుతుంటే మరోవైపు ప్రతిపక్షాలు కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో ఒక్క ఎకరం కైనా నీళ్లు ఇచ్చారా? అని కళ్లుండి చూడలేని కబొదుల్లా పసలేని ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు.

గత వేసవిలో గూడవల్లి వాగుకు గోదావరి జలాలను విడుదల చేసి 38 చెక్ డాంలను నింపామని మంత్రి తెలిపారు. తద్వారా గజ్వేల్ దుబ్బాక నియోజకవర్గంలోని 30-40 వేల ఎకరాలలో కోట్లాది రూపాయల పంటను కాపాడగలిగామని మంత్రి చెప్పారు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు రైతులతో మాట్లాడి నిజమా కాదో తేల్చుకోవాలని చాలెంజ్ చేశారు.కాలేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఇది సాధ్యమయ్యేదా అని ప్రతిపక్షాలను మంత్రి ప్రశ్నించారు. హల్దీవాగులోకి గోదావరి జలాలు విడుదల చేయడం ద్వారా అక్కడి నుంచి మంజీర నదిలోకి.. అక్కడి నుంచి నిజాంసాగర్‌కు 96 కిలోమీటర్ల మేర ప్రయాణించి వర్గల్ లోని చెరువులతో పాటు భూగర్భ జలాలు గణనీయంగా పెరిగేలా చేస్తున్నాయని మంత్రి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కే గుండె కాయ లాంటి మల్లన్న సాగర్ జలాశయం నిర్మాణం చేపడితే ప్రతిపక్షాలు ప్రాజెక్టు పూర్తి కాకుండా చూడాలన్న ఉద్దేశంతో ప్రజలను రెచ్చగొట్టాయని మంత్రి గుర్తు చేశారు. ఇక్కడికి గోదావరి నీళ్లు తేవడం అసాధ్యం అంటూ, ప్రజల నుంచి తీసుకున్న భూములను రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగిస్తారని ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారని మంత్రి గుర్తు చేశారు. పట్టుదల కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి అసాధ్యమైన పనిని సాధ్యం చేసి కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ కు గోదావరి జలాలు వచ్చేలా చూశారని అన్నారు.

Harish Rao released Mallanna Sagar water at Kodakandla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News