Sunday, April 28, 2024

అభినవ అశోకుడి సంకల్పం…. పచ్చని ఛత్రం

- Advertisement -
- Advertisement -

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఓ బుక్‌ను విడుదల చేసింది. ఈ పుస్తకంలో 7,213 పాయింట్‌లతో తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో నిలిచింది. పెరిగిన అడవుల శాతం, మున్సిపల్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో తెలంగాణ టాప్ ర్యాంకులో నిలిచింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన ఇండియా ఫారెస్టు 2021 నివేదిక ప్రకారం తెలంగాణలో గ్రీన్ కవర్ 7.70 శాతం పెరగడం గమనార్హం. ఐక్యరాజ్యసమితిలో భాగమైన పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అర్బర్ డే పౌండేషన్ వారు హైదరాబాద్ నగరాన్ని ‘ట్రీ సిటి ఆఫ్ ద వరల్ ‘గా వరుసగా రెండుసార్లు గుర్తించడం హర్షణీయం. దేశం నుండి ఈ గుర్తింపు సాధించిన ఏకైక నగరం మన హైదరాబాద్ మాత్రమే కావడం తెలంగాణకే గర్వకారణం. అలాగే నీతిఆయోగ్ ప్రకటించిన సుస్ధిర అభివృద్ధి లక్ష్యాల నివేదికలో దేశంలో పచ్చదనం పెంపులో తెలంగాణ మొదటి స్ధానంలో ఉండడమనేద కేసీఆర్ ప్రభుత్వం సాధించిన హరిత విప్లవంతోనే సాధ్యమైంది.

నాడు అశోకుడు చెట్లు నాటించాడనేది ఒక చరిత్ర.. కాకతీయులు గొలుసుకట్టు చెరువులు తవ్వించారనేది మరో గొప్ప చరిత్ర.. ఇవన్నీ మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం. ఎన్ని తరాలైనా ఆ చరిత్ర పదిలంగా ఉన్నది. అదే సమయం లో తెలంగాణలో కేసీఆర్ సృష్టించిన చరిత్ర కూడా ఒక అద్భుతం. నాయకులు అందరూ అవుతారు. కానీ ప్రజల మనసుల్లో, భావితరాలకు ఆదర్శంగా నిలిచి చరిత్ర సృష్టించడం ఒక్క కేసీఆర్‌కే సాధ్యమైంది. హరిత తెలంగాణ సాధన కోసం కృషి చేస్తున్న అభినవ అశోకున్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రూపంలో ఇప్పుడు చూస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత ప్రీతిపాత్రమైన వాటిల్లో ‘హరితహారం‘ ఒకటి.ఇది ఆయన మానసపుత్రిక‘. అందుకే ఆయన నిత్యం పరితపిస్తుంటారు. ఎప్పటికప్పుడు అందరినీ అప్రమత్తం చేస్తుంటారు. యంత్రాంగాన్ని పురమాయిస్తుంటారు. అటవీశాఖతో సహా అన్ని ప్రభుత్వ శాఖలను కార్యోన్ముఖం చేస్తారు. కేసీఆర్ తపన,కృషి వల్లే నేడు రాష్ట్రమంతా ‘హరిత తివాచీ‘ పరుచుకుంది.

తెలంగాణ ఆకుపచ్చ కిరీటంతో దేశం ముందు ఠీవీగా నిలిచింది. అడవులు తరిగిపోవడమే తప్ప పెరగడం చూడని దేశంలో గ్రీన్ కవర్ ను పెంచుకుని అటవీ విస్తీర్ణం పెరిగిన రాష్ట్రంగా తెలంగాణ సగ ర్వ పతాక ఎగరేసింది. తెలంగాణ ‘ పచ్చల హారం‘గా మారింది.. ఆయన సంకల్పదీక్ష తోనే హరితహారం ప్రకృతికి ‘మణిహారం‘గా నిలిచింది. తెలంగాణకు హరితహారమనేది ఇదోమహా యజ్ఞం. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణ పచ్చ ధనాగారమే ! తెలంగాణ సర్కార్ లక్ష్యం నిర్దేశించుకున్న లక్ష్యం పెద్దది..! అయి నా లక్ష్యసాధనలో మడమతిప్పని వెనుకడుగు వేయని ధీశాలి తెలంగాణ సీఎం కేసీఆర్. అందుకే నేడు తెలంగాణ ‘పచ్చని ఛత్రం‘ గా నిలిచింది. అడవులు అంతరించిపోతే ఇబ్బందులు పడతాం. ఒకప్పుడు ఇందల్వాయి అడవుల నుండి వెళ్లాలంటే పది వాహనాలు కలిపి ఒకేసారి పంపించేవారు. అంతటి కీకారణ్యం ఇపుడు మరుగున పడిపోయింది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సందర్భంలో అన్నారు.

ప్రతి గ్రామం పచ్చదనంతో వెల్లివిరియాలి. అందరూ తమ ఇండ్ల ముందు, ఇంటి ఖాళీస్థలాల్లో మొక్కలు నాటాలని ఇచ్చిన పిలుపు తెలంగాణ ప్రజలకు స్పూర్తిగా నిలిచింది. పచ్చని చెట్లు, దట్టమైన అడవులతో తెలంగాణకు పూర్వ వైభవం తీసుకువచ్చే సంకల్పం, పర్యావరణ పరిరక్షణ ఆశయంతో 2015 జూలై 3 న రంగారెడ్డి జిల్లా చిలుకూరులో ముఖ్యమంత్రి హరిత హారం ప్రారంభించారు. ఇప్పటివరకు తొమ్మిది సార్లు జరిగిన ఈ కార్యక్రమంలో 273.33 కోట్ల మొక్కలను రాష్ట్రవ్యాప్తంగా నాటారు. వానలు తిరిగి వాపస్ రావాలి, కోతులు అడవికి వాపస్ పోవాలి’ అనే కేసీఆర్ నినాదం హరితహారంతో నిజమైంది. ఇంతకు మించిన అద్భుతమైన కార్యక్రమం ప్రపంచంలో మరొకటి లేదు. రాష్ట్రంలో తొమ్మిదేండ్లుగా హరితహారం అద్భుతంగా అమలు జరుగుతున్న తీరుతో డబుల్ ఇంజన్ల సర్కారు రాష్ట్రాలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయి. దటీజ్ కేసీఆర్. ఒకవైపు కేసీఆర్ సంకల్పానికి తోడుగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పర్యావరణాన్ని పరిరక్షించే ఆశయంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో చేస్తున్న ఉద్యమం చేపట్టారు.

ఈ ఉద్యమాన్ని ఇటీవల ప్రధాని ప్రశంసించారు. ఇది మన తెలంగాణ రాష్ట్రానికి దక్కిన గౌరవంగా భావించాలి. ఒకరు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి హరిత సవాల్ విసరడం, ఆ ముగ్గురు మూడేసి మొక్కలు నాటడం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న ఉద్యమాలలో గ్రీన్ ఛాలెంజ్ వినూత్నమైనది. రాష్ట్ర ప్రభుత్వ నిరంతర కృషి, ప్రజల భాగస్వమ్యంతోహరితహారం ద్వారా పచ్చదనం వెల్లివిరిస్తోంది. దేశ అత్యున్నత చట్టసభ సాక్షిగా తెలంగాణ అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా కేంద్రం నుంచి ప్రశంసలు అందుకుంది.

దేశంలోనే అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ పార్లమెంట్ రికార్డుల్లో నిలిచింది. ఏ రాష్ట్రం కనుచూపు మేరలో లేదు. మహారాష్ట్రలో 30 కోట్ల మొక్కలు నాటినట్టు రికార్డులు చెప్తున్నాయి. బ్రెజిల్, చైనా తర్వాత మూడో అతిపెద్ద మానవప్రయత్నంగా తెలంగాణ హరితహారం చరిత్రకెక్కుతున్నది. హరితహారం ద్వారా ఇప్పటి వరకు 273.33 కోట్ల మొక్కలను నాటారు. 19 వేల ఆవాసాలు, గ్రామపంచాయతీల్లో పార్కులను ఏర్పాటు చేశారు. పల్లెలు, పట్టణాల్లో ప్రకృతి వనాలు, పార్కులు ఏర్పాటుతో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. యాదాద్రి మాడ ల్ ప్లాంటేషన్ హరితహారంలో ఒక అద్భుతం. పట్టణాల స్థానికసంస్థల బడ్జెట్‌లో కనీసం10 శాతం కచ్చితంగా హరితహారం, మొక్కల పెంపకం, సంరక్షణ, నర్సరీలు తదితర వాటి కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు. అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర వైశాల్యంలో 33 శాతానికి విస్తరించుకోవాలన్న లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో పచ్చదనం ఇప్పటికే 28 శాతానికి చేరుకున్నందున మరో 5 శాతాన్ని సాధిస్తే తెలంగాణ రాష్ట్రం 33 శాతం అడవులున్న రాష్ట్రంగా దేశానికే ఒక రోల్‌మోడల్ అవుతుంది. పట్టణాభివృద్ధి శాఖమంత్రి కేటీఆర్ అత్యంత చొరవ తీసుకుని అర్బన్ ఫారెస్ట్రీ కింద అత్యాధునిక హంగులతో ప్రజలకు అనుకూలంగా వుండే పార్కులను పట్టణాలలో ఏర్పాటు చేయిస్తున్నారు. నూతనంగా నిర్మిస్తున్న రిజర్వాయర్లు, బ్యారేజీల వద్ద వున్న ఖాళీ స్థలాలలోను, చెరువు గట్ల మీద మొక్కలు పెంచడం జరుగుతున్నది. పల్లె ప్రగతి కింద భారీఎత్తున గ్రామాలలో నర్సరీలు ఏర్పాటు చేయడం విశేషం.

రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో తెలంగాణలో గ్రీన్‌కవర్ 18 శాతం నుంచి 31.6 శాతానికి పెరిగింది. 2015లో తెలంగాణలో గ్రీన్‌కవర్ 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా, 2021 నాటికి అది 21,214 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. పచ్చదనం పెంపు లో హైదరాబాద్‌కు గ్రీన్‌సిటీ అవార్డు దక్కింది. లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనమిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ అవార్డునూ హైదరాబాద్ దక్కించుకున్నది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్)ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. భారత్ నుంచి ఈ పురస్కారం అందుకొన్న ఒకే ఒక్క సిటీ హైదరాబాద్. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అటవీశాఖతో పాటు వివిధ శాఖలు దాదాపు రూ. 10,822.46 కోట్లు ఖర్చు చేశాయి. హరితహారం కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవటానికి హరితనిధిని ఏర్పాటు చేశారు. అడవుల పునరుజ్జీవం కోసం రూ 1500 కోట్లు వ్యయం చేసిన ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణయే కావడం ముదాహం. అడవుల పరిరక్షణ చర్యల వల్ల వన్యమృగాల సంఖ్య గణనీయంగా పెరిగిందనే చెప్పాలి. రాష్ట్రంలో పులుల సంఖ్య 26కు, చిరుత పులుల సంఖ్య 341 కు చేరింది. అంతరించిపోతున్న అనేక పక్షిజాతుల ఊపిరిపోసుకున్న పరిస్ధితి నేడు ప్రస్పుటంగా కనిపిస్తుననది.

తెలంగాణకు హరితహారం, గ్రీన్ ఇండి యా చాలెంజ్ కార్యక్రమాల ద్వారా మొక్కలు నాటడం, సంరక్షించడం అనే భావ న ప్రజల్లో పెరిగింది. అయితే పర్యావరణ పరిరక్షణ లో ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించాలనే ఆశయంతో సీఎం వినూత్నంగాప్రవేశపెట్టిన ‘హరితనిధి‘కి అనూహ్యస్పందన లభించడం విశేషంగా చెప్పుకోవాలి. తెలంగాణకు హరితహారం అమలు, రాష్ట్రవ్యాప్తంగా పరుచుకున్న పచ్చదనం దేశానికి ఆదర్శంగా ఉన్నదని ‘గ్రీన్ తమిళనాడు మిషన్’ డైరెక్టర్, సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి దీపక్ శ్రీవాత్సవ కొనియాడారు.

ఇటీవల ఆయన తెలంగాణరాష్ట్రంలో పర్యటించి హరిత హారం అమలు తీరును చూసి కేసీఆర్ నిబద్దత, పట్టుదల, చిత్తశుద్దిని ఆయన ప్రశంసించడం గమనార్హం. ఒక ప్రాధాన్య పథకంగా పచ్చదనం పెంపును తెలంగాణ ప్రభుత్వం అమలుచేయడం సీఎం కేసీఆర్ ముందుచూపునకు, దూరదృష్టికి నిదర్శనమని దీపక్ శ్రీవాత్సవ అన్నారు. ప్రముఖ యోగా గురువు, ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలంగాణ కీర్తిని కొనియాడుతూ దేశంలోని రాష్ట్రాలన్నీ తెలంగాణ నుంచి స్ఫూర్తి పొందాలని సూచిం చారు. పచ్చదనం అభివృద్ధిలో తెలంగాణ నెలకొల్పుతున్న రికార్డులను బ్రేక్ చేయటానికి ఇతర రాష్ట్రాలు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ఈ విధం గా పదేండ్ల తెలంగాణను అన్ని రంగాలతోపాటు ప్రకృతి పరిరక్షణలోనూ దేశానికి ఆదర్శంగా నిలుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు.

– కోలేటి దామోదర్
ఛైర్మన్, తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News