Tuesday, April 30, 2024

వెతల వాన

- Advertisement -
- Advertisement -

తెగిన రోడ్లు, కరకట్టలు.. కోతలకు గురౌతున్న వంతెనలు వాగులో కొట్టుకుపోయిన టీవి ఛానల్ వాహనం,
విలేకరి గల్లంతు, బయటపడిన మరో వ్యక్తి వరద నీటిలో చిక్కుకున్న 8మంది కూలీలు, రక్షించిన
ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రోడ్డు కల్వర్టు తెగి గర్భిణీకి కష్టాలు జల దిగ్బంధంలోనే అనేక గ్రామాలు…
లక్షా 90వేల మంది పునరావాస కేంద్రాలకు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు సత్యవతి రాథోడ్,అల్లోల

మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్ : ఆకాశానికి చిల్లు పడిందన్న రీతిలో గడచిన ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కు రుస్తున్న వర్షంతో రాష్ట్రవ్యాప్తంగా జనం అష్టకష్టాలు పడుతున్నారు. ఇంతకుముం దెన్నడూ చూడనివిధంగా వర్షాల జోరుతో ప్రజలు బేజారు చెందుతున్నారు. రాష్ట్రం లో ఈ ప్రాంతం.. ఆ ప్రాంతం అని లేకుండా అన్ని జిల్లాల్లోనూ రోజస్తమానూ వ ర్షంతో జనజీవనం స్తంభించిపోతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అగకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తమ పను ల నిమిత్తం ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో రోడ్లన్ని నిర్మానుష్యంగా మారుతున్నాయి. కాగా, ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

దీంతో పలు జిల్లాల్లో రోడ్లు గండ్లు పడి కొట్టుకుపోయాయి. కరకట్టలు తెగి రాకపోకలకు జనం ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ జనం తెగించి ఆ వరద నీటి నుంచే ప్రయాణాలు చేసి అవస్థలు కొనితెచ్చుకుంటున్నారు. కాగా, గ్రామాల్లోని పల్లపు ప్రాంతాలు జలమయం కావడంతో ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో లక్షా 90వేల మందిని అధికారులు తాత్కాలికంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. నిజామాబాద్ జిల్లా పోచంపహాడ్ శ్రీరాం సాగర్ జలాశయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించగా, బయ్యారం వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపి కవిత పర్యటించారు. సుద్దరేవు, కిష్టాపురం, కోటగడ్డ ప్రాంతాలలోని అలిగేరు, మసివాగు తదితర ప్రాంతాల్లోని పర్యటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, ఆదిలాబాద్ జిల్లాలో కల్వర్టులు కోతలకు గురికాగా పలు మండలాల్లో రోడ్లు బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి.

మరోవైపు పంటల్లో నాట్లువేసిన రైతులు బేజారౌతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెరువులు, చెక్‌డ్యాంలు నిండిపోయాయి. అంతర రాష్ట్ర పెన్‌గంగకు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద తాకిడి పెరుగుతూనే ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని మత్తడి వగు ప్రాజెక్ట్ , సత్నాల ప్రాజెక్టులు నిండుకుండలా మరిపోయాయి. కాగా, ఖానాపూర్ నుంచి నిర్మల్ వెళ్లే రహదారిలో దిమ్మదుర్తి వద్ద కొత్తగా నిర్మిస్తున్న వంతెన వద్ద తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు వరద నీటితో కొట్టుకుపోవడంతో నిర్మల్ వెళ్లే రహదారి మూసుకుపోయింది. ఖానాపూర్‌కు వచ్చిపోయే మూడు రహదారులు భారీ వర్షం వల్ల వాగులు వంకలు ఉప్పొంగడంతో ఖానాపూర్‌కు రాకపోకలు స్తంభించిపోయాయి. గత పది సంవత్సరాల నుండి జూలై నెలలో ఇంత పెద్ద వర్షాలు కురవడం ఇదే మొదటిసారి అని అధికారులు అంటున్నారు. గోదావరి నది సైతం 10 సంవత్సరాల కాలంలో జులై నెలలో భారీ ఎత్తున వరదరావడం కూడా మొదటిసారి అని అధికారులు తెలిపారు.

చత్తీస్‌గడ్, మహారాష్ట్రలలో కురుస్తున్న వర్షాలతోపాటు స్థానికంగా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత ఉగ్రరూపం దాల్చి ప్రవాహిస్తోంది. దీంతో జలపాతం సందర్శనను మూడు రోజులపాటు నిలిపివేశారు. ఎగువ ప్రాంతల నుంచి వస్తున్న వరద నీటితో పేరూరు, పూసూరు వంతెన వద్ద గోదావరి ఉధృతంగా ప్రవాహిస్తోంది.

వరద ప్రాంతాల్లో మంత్రి సత్యవతి, ఎంపి కవిత

కాగా, బయ్యారం వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపి కవిత పర్యటించారు. సుద్దరేవు, కిష్టాపురం, కోటగడ్డ ప్రాంతాలలోని అలిగేరు, మసివాగు, పందిపంపుల వాగుల వరద ఉధృతిని పరిశీలించి స్థానికులకు ధైర్యం చెప్పారు. నల్లగొండ జిల్లాలో ఎడతెరపిలేని వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. వివిధ గ్రామాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పత్తి, సోయా మినుము పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయి. రహదారులు సైతం దెబ్బతినడంతో ప్రజలు రాకపోలకు కొనసాగించడానికి అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ పరిస్థితి ఇందుకు మినహాయింపేమి కానట్టుగా ఉంది. పలు చెరువులు ముత్తడి పోయడంతో పల్లపు ప్రాంతాలు జలమయమవడంతోపాటు, పలు కాలనీలు నీట మునిగాయి.

ఎన్‌డిఆర్‌ఎఫ్ సాయంతో క్షేమంగా బైట పడ్డ గిరిజన కూలీలు

బోర్నపెల్లి శివారులోని గోదావరి నది సమీపంలో నిర్మల్ జిల్లా కడెం మండలం చిట్యాల గ్రామ మధ్యలోని కుర్రు అటవీ ప్రాంతంలో చిక్కుకున్న 9మంది కూలీలను ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సురక్షితంగా వడ్డకు తీసుకువచ్చారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపెల్లి గ్రామ సమీపంలో వ్యవసాయ పనులకు వెళ్లిన గిరిజన కూలీలు వరద ప్రవహంలో ఎటుకదలలేక ఉండిపోయారు. దాంతో జగిత్యాల కలెక్టర్ గుగులోతు రవి, ఎస్‌పి సింధు శర్మ, ఇతర అధికారులు బోర్నపల్లికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి, కాగా, సిఎం కెసిఆర్ ఆదేశాలతో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను తరలించి మంగళవారం రాత్రి పొద్దుపోయాకా అవతల గట్టు నుంచి బాధితుల గిరిజన కూలీలను బోట్ల సాయంతో గోదావరి ఇవతల బోర్నపల్లి ఒడ్డుకు చేర్చారు. గిరిజనులు క్షేమంగా బైటకు తీసుకువచ్చిన ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను కలెక్టర్, ఎస్పీ అభినందించారు.

అధికారులు ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం ఇబ్బందేం లేదని, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉన్నాయని బాధితులు కలెక్టర్ తెలుపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వర్షం తగ్గుముఖం పడితే ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు కూలీలను బైటకు తీసుకువచ్చేందుకు చూస్తున్నారు. వర్షం తగ్గకపోతే బుధవారం సహాయక చర్యలు చేపట్టే అవకాశం కన్పిస్తోంది.

వరద నీటిలో కొట్టుకుపోయిన ఓ ఛానల్ వాహనం
రిపోర్టర్ గల్లంతు

ఇదిలా ఉండగా, వరద నీటిలో చిక్కుకునిపోయిన కూలీల వార్తను కవర్ చేసేందుకు రాయికల్ మండలం బోర్నపల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా రామోజీపేట వాగులో ఒక ఛానల్‌కు చెందిన వాహనంతోపాటు ఒక రిపోర్టర్ గల్లంతయ్యాడు. కల్వర్టుపై వరద నీటిలోనే వాహనాన్ని నడపడం.. అది కాస్తా అదుపు తప్పడంతో కారుతో పాటు జమేర్ అనే రిపోర్టర్ గల్లంతయ్యాడు. కాగా, ఆ వాహనంలో జమేర్‌తోపాటు వెెళ్లిన మరో షమీ అనే మరో వ్యక్తి నీటిలో కొంతదూరం కొట్టుకుపోయి చెట్టు కొమ్మలు పట్టుకుని బయటపడ్డాడు. షమీ ఇచ్చిన సమాచారంతో జమేర్ కోసం అధికారులు ఘటనా ప్రాంతానికి తరలివెళ్లాయి. కాగా, రెస్కూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టేందుకు బయలుదేరి వెళ్లాయి.

రోడ్డు కల్వర్టు తెగి గర్భిణీకి కష్టాలు

ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో నిర్మించిన కల్వర్టు వరద ఉధృతికి కూలిపోయింది. మంగళవారం జల్ద గ్రామానికి చెందిన జయశ్రీ అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో వెంటనే గ్రామస్తులు కుటుంబీకులు 108అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. హుటాహుటిన బయలుదేరిన అంబులెన్స్ ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కూలిన కల్వర్టు అవతలవైపు ఆగిపోయింది. వెంటనే కుటుంబీకులు గర్భిణీని చేతులతో తీసుకెళ్లి నేషనల్ హైవేపై అంబులెన్స్ ద్వారా మొదట ఇచ్చోడ ప్రాథమిక ఆసుపత్రికి తరలించి.. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News