Tuesday, May 14, 2024

చెన్నైలో భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -
Heavy rains lash Chennai
2015 స్థితి రాకుండా జాగ్రత్తలు

చెన్నై : తమిళనాడులో ఆదివారం భారీ వర్షాలతో జనజీవితం కుదేలయింది. రాజధాని చెన్నై , సమీప ప్రాంతాలలో , మూడు జిల్లాల్లో ట్రాఫిక్‌జాంలు , వరదలతో పల్లపు ప్రాంతాలు జలమయం కావడం వంటి ఘటనలు జరిగాయి. వర్షాల ప్రభావంతో వరుసగా రెండు మూడురోజులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర తమిళనాడులో చాలారోజులుగా పూర్తిగా తేమతో కూడిన వాతావరణం నెలకొంది. వారం పదిరోజులుగా పలు ప్రాంతాలలో వర్షాలు వీడకుండా పడుతున్నాయి. దీనితో జనం తేరుకోలేని స్థితిలో ఉన్నారు. ఇదే సమయంలో ఆదివారం నుంచి చెన్నై ఇతర ప్రాంతాలలో కుండపోత వానలు పరిస్థితిని మరింత అగమ్యగోచరం చేశాయి. చెన్నైలో ఆదివారం ఉదయం 8.30 గంటలకే దాదాపుగా 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

పలు లోతట్టు ప్రాంతాలు, మురికివాడలలోకి నడుం లోతు నీరు వచ్చి చేరింది. బంగళాఖాతంలో నెలకొన్న అల్పపీడన సమస్యనే ఇప్పటి వర్షాల ధాటికి దారితీసింది. సోమవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనితో అవాంఛనీయ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సమాయత్తం అయింది. సోమవారం రాత్రి కొంత మేర వర్షాలు తగ్గుముఖం పట్టినా తిరిగి మంగళ, బుధవారాలలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చెన్నై చుట్టపక్కల చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ప్రధానమైన చెంబరంబక్కమ్ చెరువు ఇప్పుడు దాదాపు పూర్తి స్థాయి నీటి సామర్థానికి అంటే 82 అడుగుల స్థాయికి చేరింది. దీని పూర్తి స్థాయి నిల్వ సామర్థం 85.4 అడుగుల ఎత్తు వరకూ ఉంది. 2015లో భారీ వర్షాల సమయంలోనే ఈ జలాశయం నుంచి నీటిని వదలడంతో చైన్నైలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈసారి ఇటువంటి ముప్పు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు నీటిని దిగువకు వదులుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News