మనతెలంగాణ/హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్వేత మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె తల్లిదండ్రులు తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని పేర్కొంటున్నారు. తమ బిడ్డ ప్రాణాలు తీసుకునేంత పిరికిది కాదని అన్నారు. అజయ్ శ్వేతను రైలు పట్టాల వద్దకు తీసుకెళ్లి చంపేసి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. తమ బిడ్డను అజయ్ హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని మీడియా ఎదుట వాపోయారు. అతనికి కొందరు పోలీసులు కూడా సాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రేమ పేరుతో అజయ్ తమ కూతురుని వేధింపులకు గురిచేశాడని శ్వేత తల్లిదండ్రులు వెల్లడించారు. ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్ మెయిల్కు దిగాడని అజయ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని రాచకొండ కమిషనర్ను కలిశామని మంగళవారం మధ్యాహ్నం తెలిపారు. కాగా మేడిపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శ్వేత ఘట్కేసర్ రైలు పట్టాలపై శవమై కనిపించిన సంగతి తెలిసిందే.
లాలాపేటకు చెందిన అజయ్ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేమ పేరుతో ఆమెను వంచించడం వల్లనే బలవన్మరణానికి పాల్పడిందని ప్రచారం జరిగింది. ప్రియుడు మోసం చేశాడని సాఫ్ట్వేర్ ఇంజినీర్ శ్వేత ట్రైన్కు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తాజాగా కొత్తకోణం వెలుగుచూసింది. శ్వేత ఆత్మహత్య చేసుకోలేదని ఆమె తల్లిదండ్రులు తేల్చిచెబుతున్నారు. తమ కూతురిని అజయ్ హత్య చేసి రైల్వే ట్రాక్ దగ్గరకు అజయ్ తీసుకెళ్లాడని శ్వేత తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రేమ, పెళ్లి పేరుతో శ్వేతను మోసం చేశాడని.శ్వేతను అజయ్ ప్రేమ పేరిట బ్లాక్ మెయిల్ చేశాడని వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశాడని వారు మీడియాకు వెల్లడించారు. ఆ అవమానం తట్టుకోలేక శ్వేత డిప్రెషన్కు లోనైందని పేరెంట్స్ అంటున్నారు.