Sunday, May 5, 2024

‘దౌత్యం’లోనూ కాషాయమే!

- Advertisement -
- Advertisement -

Modi had in virtual address to leaders of bjp party

నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత విదేశాంగ విధానంలో కాషాయీకరణ మొదలైంది. ‘సమగ్ర మానవతా వాదం’ (ఇంటిగ్రల్ హ్యూమనిజం) పేరుతో భారతీయ జనతాపార్టీ, దీనదయాళ్ ఉపాధ్యాయ ఆలోచనా విధానాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ 2017లో అధికారికంగా విడుదల చేసింది. ఈ నివేదికను విడుదల చేయకముందు ఈ మంత్రిత్వ శాఖ దేశీయ రాజకీయాలలో గతంలో ఎన్నడూ జోక్యం చేసుకోలేదు. భారతీయ ఆలోచనా విధానం హిందూ ఆలోచనా విధానంతో సమానమని చెప్పడమే కాకుండా ‘హిందూ సమాజం తనను తాను సంఘటిత పరుచుకోవడం మొదలైంది’ అని పేర్కొంది. నెహ్రూ అంతర్జాతీయ విధానం నుంచి హిందూత్వ విధానానికి మారిన పరిణామం స్పష్టంగా, బాహాటంగా కనిపిస్తున్నప్పటికీ ఈ మార్పును అధికారికంగా ప్రకటించడానికి వారు సిద్ధంగా లేరు. అరుదుగా కొందరిని మినహాయిస్తే, భారత విశ్లేషకులు కూడా ఈ విషయంపైన నోరు మెదపడానికి సిద్ధంగా లేరు. పైగా వారు మోడీ విదేశాంగ విధానం చాలా విజయవంతమైందని ఊదరగొట్టేస్తున్నారు.

భారత దౌత్యవిధానంలో కొట్టవచ్చినట్టు జరిగిన ఈ మార్పు ను అంతర్జాతీయ జర్నల్స్, పరిశోధనల ద్వారానే మనం గమనించగలుగుతున్నాం. భారత దౌత్య విధానాన్ని హిందూత్వవాదం ఎలా ప్రభావితం చేస్తోందో, ఈ మౌలికమైన మార్పునకు బాగా చదువుకున్న భారత విదేశీ వ్యవహార సేవల (ఐఎఫ్‌ఎస్) అధికారులు ఎలా స్పందించారో వివరిస్తూ, బ్రిటన్ నుంచి వెలువడే ‘ఇంటర్నేషనల్ ఎఫైర్స్’ జర్నల్ మార్చి సంచికలో చాలా విలువైన విషయాలను పొందుపరిచింది. పద్దెనిమిది పేజీల ఈ వ్యాసాన్ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో లెక్చెరర్‌గా పని చేస్తున్న కిరాహుజు 85 మందితో ఇంటర్వ్యూలు చేసి రాశారు. ఈ ఇంటర్వ్యూలలో రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్లతో పాటు, హిందూత్వ వాదాన్ని ఒంటబట్టించుకుని, కొత్తగా నియమితులైన ఐఎఫ్‌ఎస్ అధికారులు కూడా ఉన్నారు. ‘నెహ్రూ అంతర్జాతీయ విధానం నుంచి మోడీ హిందూత్వ వాదానికి’, ‘హిదూత్వం, రోజు వారీ దౌత్యశిక్షణ’, ‘అనుసరణ, ప్రతిఘటన’, ‘సైద్ధాంతిక ప్రయాణం, సామాజిక తప్పుడు విధానం’, ‘అంతర్గత పరాయివాళ్ళుగా విశ్వజనీనమైన మేధావులు’ అన్న అంశాలపై ఈ అధ్యయనం సాగింది.

విభజన వాదాన్ని నీరుగార్చడమే కాకుండా, కాషాయీకరణ జరగాలనే ప్రస్తుత హిందూత్వ వాదనకు బలం ఎలా చేకూరుతోందో అర్థం చేసుకోవడానికి ఇది దోహదం చేస్తోంది. నిదానమైనా కనిపించే మథనం రోజువారీ దౌత్యకార్యకలాపాలతో పాటు, భారత దౌత్యకార్యాలయాలు హిందూత్వ విస్తరణకు జరిగిన అనేక సంఘటనలు ఎలా దోహదం చేస్తున్నాయో ఈ అధ్యయనం వివరిస్తుంది. ఈ సంఘటనలన్నీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనబడే ‘హిదూత్వ పరామిలటరీ సంస్థ’ చేపట్టినవే. ఈ పక్షపాత ధోరణిని లౌకిక దృక్పథం కల అధికారులు, మతపరంగా అల్పసంఖ్యాక వర్గానికి చెందిన అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారని పేర్కొంది. దౌత్య కార్యాలయాల్లో తమ భుజాలపైన ఆర్‌ఎస్‌ఎస్ స్వారీ చేస్తోందని సీనియర్ అధికారులు గమనించేటట్టు ఈ అధ్యయనం చేసిందని బిబిసి విదేశీ వ్యవహారాల కరస్పాండెంట్ ఆషిఫ్ రాయ్ అన్నట్టు రచయిత పేర్కొన్నారు. స్థానికంగా ఉండే మోడీ విధేయులు తాము చెప్పిందే శిలాశాసనమన్నట్టు అధికారం చెలాయించడం మొదలు పెట్టారు. ఎంబసీలపైన, హైకమిషన్‌లపైన ఏ స్థాయిలో పెత్తనం జరుగుతోందనేది కచ్చితంగా చెప్పలేమని రచయిత తెలిపారు. పాత దౌత్యవిధానం స్థానంలో, స్వల్ప విశ్వజనీనత, జాతీయవాద విజయగర్వంతో హిందూత్వానికి, హిందీ భాషకు మారే పరిణామాన్ని చిత్తశుద్ధితో చేపడుతున్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది.

దౌత్య ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఇంగ్లీషును తగ్గించి, హిందీ భాషను బలవంతంగా చొప్పిస్తూ, ఇది ప్రామాణికమైన భారతీయీకరణ అంటున్నారని వ్యక్తిగతంగా తాము భావిస్తున్నట్టు పలువురు దౌత్యవేత్తలు తమ ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. ‘వలస పాలనకు అనుకూలంగా మనసులను ఎలా మలిచారు’, విదేశీ పాలకులకు చెప్పడం ఆలస్యమైనా, చెప్పడం తప్పనిసరి అనేది వారి భావన. భారతదేశం మోడీ పాలనలో వలస భాషను వదిలించుకుంటోందనేది వారి వాదన. ప్రపంచ వ్యవహారాల భారత కౌన్సిల్ కోసం హిందీ భాష పుస్తకం అచ్చు వేశారు. విదేశీ విధానాల హిందీ భాషా మహాసభను ప్రధాని నిర్వహించారు. దీంతో దక్షిణాదికి చెందిన దౌత్యవేత్తలు హిందీలో మాట్లాడడానికి చాలా ఇబ్బందిపడ్డారు. ఈ విషయాలన్నీ ‘విదేశీ వ్యవహారాల’ కోసం 2019 లో చేసిన ఇంటర్వ్యూలో వెల్లడయ్యాయి. ఐఎఫ్‌ఎస్ అధికారులుగా ఎంపికైన వారు తొలి ఉద్యోగంలో చేరడానికి ముందు ఇచ్చే శిక్షణలో అనేక మార్పులు చేశారు. ‘ఈ ప్రభుత్వానికి ఇదొక శాఖ’ అని పరిపాలనా వ్యవస్థపై సానుభూతిగా ఒక దౌత్యవేత్త అన్నారు. వాళ్ళు ‘ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆదేశాలను తప్పని సరిగా పాటించాలి. ఆ ఆదేశాల ప్రకారం ఆయుర్వేదం, హోమియోపతి, యోగా వారికి చాలా ముఖ్యం. ప్రొటోకాల్ నిబంధన ప్రకారం ప్రొబేషనరీ దౌత్య అధికారులు సహజంగా అంతర్జాతీయ సభలకు, సమావేశాలకు హాజరు కావాలి. కానీ, దానికి భిన్నంగా 2019లో వారు కుంభమేళా మత కార్యక్రమానికి హాజరు కావాల్సి వచ్చింది.

PM Narendra Modi

‘భారత దేశంలో హిందూ జాతీయవాదం’ అనే అధ్యయన పత్రాలలో ముస్లింల చేతులలో హిందువులు బాధింపబడడాన్ని వర్ణిస్తూ, హిందూత్వవాద దైవదత్త గొప్పతనాన్ని ఉద్ఘాటించారు. దౌత్య ముసుగులో హిందూత్వ సవాళ్ళు, భారత దేశాన్ని భిన్నత్వ, లౌకికకత్వానికి ప్రతినిధిగా అభివర్ణించారు. రాజకీయాలకు బదులు సాంస్కృతిక ఔన్నత్యం, అంతర్జాతీయ భద్రతలో విరాట్ స్వరూపం, హిందుత్వ పునరుద్ధరణ ద్వారా పాశ్చాత్యీకరణను వ్యతిరేకించడం. ‘భారతీయ ఉనికిపై సందిగ్ధత అస్పష్టంగా ఉంది. సంప్రదాయ నాగరికులుగా ఉన్న భారత పాలకులు జాతిపరంగా, మతపరంగా పదునుగా తయారయ్యారు. భారతీయ సంస్కృతిగా శాశ్వత మార్పు చేయాలన్నది వారి ఆకాంక్ష. ‘నెత్తురు, నేలను కూడా మతాంతీకరణ జరుపుతారు’ అని ఒక ముస్లిం అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. కాషాయీకరణ అతిగా వ్యాప్తి చేయడం వల్ల భారత సంస్కృతికి హాని జరిగే అవకాశం ఉంది. మోడీ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి హిందూ, బౌద్ధ దేవాలయాలను సందర్శించాలని పట్టుబట్టడమే కాకుండా, భగవద్గీత వంటి హిందూ గ్రంథాలను, కళాఖండాలను ఆయా దేశాధినేతలకు బహుమతిగా ఇస్తుంటారు. దౌత్యంలో విశ్వజనీనతను మోడీ తిరస్కరిస్తారు. నూతన ప్రధానిగా 2014లో ఆయన ప్రమాణస్వీకార చేశాక ఐఎఫ్‌ఎస్ నూతన ప్రొబేషనరీ ఆఫీసర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ, విదేశీ జాతులను ‘గయ్యాళి అత్తల’తో పోల్చారు.

విదేశీ వ్యవహారాలలో ఆర్‌ఎస్‌ఎస్ సానుభూతిపరుల సంఖ్య పెరిగిపోతోందని, సాంస్కృతిక పునః విద్య ప్రదర్శనకు ఇది చిహ్నమని రచయిత అంటారు. ఈ మథనం నిదానంగా జరుగుతుందని, మరో పదిహేనేళ్ళలో నెహ్రూ తరహా విధాన దౌత్యవేత్తలు రిటైరైపోతారని, ఆ స్థానాలన్నీ (హిందూ) జాతీయవాద మనస్తత్వంతో నింపేస్తామని, విదేశీ వ్యవహారాల శాఖ కోసం భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా పని చేస్తున్న కాంట్రాక్టర్ ఒకరు అంటారు. తమ కాలమంతా భిన్నత్వం, లౌకికత్వ విలువలకు కట్టుబడి పని చేశామని అంటూ ఒక సిక్కు అధికారి ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నీటిపర్యంతమయ్యారు. ‘అయిదేళ్ళ క్రితం వరకు మేమంతా విశ్వజనీనమైన వారం. కానీ, ఈ రోజు పునరేకీకరణ వాతావరణం సంకుచితమైన మనుగడ సమస్యను ముందుకు తెస్తోంది’ అని ఒక రిటైర్డ్ ముస్లిం అధికారి అన్నారు. ‘తన 40 ఏళ్ళ సర్వీసులో విశ్వజనీనతకు, భారతీయీకరణకు ఒక్కసారి కాదు, అనేక సార్లు న్యాయం చేశానని, సంస్కృతి, మనుగడ పైన 10 పుస్తకాలు రాశానని తెలిపారు.

“ఒక బలమైన విదేశీ శక్తులు లౌకికవాదులు, నయా వలసవాదులు, చట్ట వ్యతిరేకులు ప్రమాదకరమైన మైనారిటీలతో సంబంధాలు పెట్టుకుని భారత దేశంతో సంబంధాలు నెరుపుతున్నారు” అని హిందూత్వ నిర్మాణంలో ఉన్న సంప్రదాయ ఐఎఫ్‌ఎస్ మేధావులు అంటున్నారని పరిశోధనా పత్ర రచయిత హుజు అంటారు. ఈ వర్ణనలో ఐఎఫ్‌ఎస్ ను కాషాయీకరించడాన్ని సమర్థించుకోవడంతో పాటు, మేధోపర వ్యతిరేకులు బహుళత్వానికి తామే అధినాయకులమని తమని తాము ప్రకటించుకుంటున్నారు.

‘రక్షణను పెంచలేదు, ఆర్థిక ప్రయోజనాలనూ కాపాడలేదు’ హుజు రాసిన ఈ పరిశోధనా పత్రాలపైన రిటైరైన ఐఎఫ్‌ఎస్ అధికారులతో ‘ద వైర్’ చర్చించింది. ఆమె వివరించిన ఈ ధోరణులన్నీ నేటి భారత దౌత్య విధానంలో ఒక ముఖ్యమైన భాగమని వారన్నారు. “మేం ఎప్పుడూ ఒక జాతీయ చర్చనీయాంశాన్ని ముందుకు తీసుకెళతాము. కానీ అది సైద్ధాంతికత కంటే ఎక్కువ ప్రయోజనకరమైనది” అని ఒక మాజీ రాయబారి అంటారు. బిజెపి అధికారం చేపట్టాక తొలిసారిగా అనుసరించిన దౌత్య విధానాన్ని ఒక పాత తరం అధికారి నేటి విధానంతో పోల్చారు. “తొలిసారి అధికారం చేపట్టిన ఎన్‌డిఎ విధానానికి నేటి విధానం ఎందుకు భిన్నంగా ఉంది? ఈ విద్వేష విధానానికి ఒక నాటి జాతీయ భద్రతా సలహాదారు బ్రిజేష్ మిశ్రా బాధ్యులా?’ అని ప్రశ్నించారు.

‘ప్రస్తుతం ఏం జరుగుతోందో చెప్పడానికి కొంత మంది అధికారులు ఇష్టపడరు. తమ ఉద్యోగాలకు ఎక్కడ ముప్పు వస్తుందోనని వారు మౌనంగా ఉండిపోతారు. కనుక, హుజు చేసిన సర్వే వాస్తవాలను పూర్తిగా ప్రతిబింబించలేదు’ అని ఒక ఐపిఎస్ అధికారి అంటారు. ఈ రకమైన విదేశీ విధానం వల్ల మన భద్రతా వ్యవస్థ మెరుగుపడదు సరికదా, మన ఆర్థిక ప్రయోజనాలు కూడా నెరవేరవు. అంతర్జాతీయ వ్యవస్థలో బలమైన శక్తులు తమ విదేశీ విధానాలను పరిరక్షించుకున్నట్టు, మన విధానాలకు అంతర్జాతీయ ఆమోదం లభించదు” అంటారు.

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News