Tuesday, May 21, 2024

మున్సిపాలిటీల్లో ఇంటి పన్నును తగ్గించాలి

- Advertisement -
- Advertisement -
  • బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండె హరిప్రసాద్

ఆమనగల్లు: మున్సిపల్ కేంద్రాల్లో ఇంటి పన్నులు విపరీతంగా పెంచారని, వాటిని వెంటనే తగ్గించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండె హరిప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న పన్నుల కన్నా మూడింతల పన్నును పెంచారని దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమనగల్లు పట్టణంలో పెంచిన ఇంటి పన్నులను తగ్గించాలని కోరుతూ మంగళవారం బిజెపి పట్టణ అధ్యక్షుడు మాండన్ శ్రీకాంత్‌సింగ్ ఆధ్వర్యంలో ఆందోళన, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. బిజెపి నాయకులతో కలిసి జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి, మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇంటి పన్నులను తగ్గించాలని, మున్సిపాలిటీలో ఈజీఎస్ పనులను వర్తింపజేయాలని, వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కమీషనర్ వి. శ్యాంసుందర్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా ధర్నాను ఉద్ధేశించి కండె హరిప్రసాద్ మాట్లాడుతూ ఒకవైపు ఇప్పటికే పర్మిషన్ల రేట్లను పెంచడంతో సామాన్యుడు ఇళ్లు కట్టుకునే పరిస్థితిల్లో లేడని, దానికి తోడు ఇంటి పన్నులు పెంచడం పేద, మధ్య తరగతి సామాన్య ప్రజానీకానికి భారంగా మారిందని అన్నారు. ఇంటి పన్నును పెంచడంతో వేతనంతో బతికే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పెంచిన ఇంటిపన్నులను వెంటనే తగ్గించకపోతే బిజెపి ఆధ్వర్యంలో భవిష్యత్తు పోరాటాలకు సిద్ధమవుతామని హరిప్రసాద్ హెచ్చరించారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నేనావత్ రాంపాల్‌నాయక్, వైస్‌చైర్మన్ భీమనపల్లి దుర్గయ్య, నాయకులు గోరేటి నర్సింహ్మ, తల్లోజు విజయ్‌కృష్ణ, చెక్కల లక్ష్మణ్, బైకని శ్రీశైలం యాదవ్, కడారి పారేషా, గోజ ఆనంద్, చెన్నకేశవులు, లండం కృష్ణయ్య, దుడ్డు యాదయ్య, గోరేటి యాదగిరి, వరికుప్పల శ్రీనివాస్, తోట మల్లేష్, శ్రీశైలం, బ్రహ్మం, తోట ఆనంద్, పెద్దయ్య, సముద్రాల వెంకటేష్, సురేష్, గుంటూరు మల్లేష్, ఏకుల శ్రీను, ఎర్రవోలు శ్రీను తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News