మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్లో మెట్రో రైలు సేవలను విస్తరించడంలో భాగంగా మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిఎం రేవంత్రెడ్డి ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సలహాదారు ఎన్.వి.ఎస్. రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎంఏయూడి సెక్రటరీ ఇలంబర్తి, హెచ్ఎంఆర్ఎల్ ఎండి సర్ఫరాజ్ అహ్మద్, సిఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సిఎం సెక్రటరీ మాణిక్రాజ్ పాల్గొన్నారు. ఎల్ అం డ్ టి గ్రూప్ సిఎండి ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్, సిఎండి సలహాదారు డి. కె. సేన్, ఎల్ అండ్ టి మెట్రో రైల్ ఎండి, సీఈఓ కె.వి.బి.రెడ్డిలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో మెట్రో రైలు ఫేజ్ 1లో తమకున్న మొత్తం వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎల్ అండ్ టి కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
దాదాపు 163 కిలోమీటర్ల మేరకు మెట్రోను విస్తరించేందుకు
ఎల్ అండ్ టికి మెట్రోపై ప్రస్తుతం ఉన్న దాదాపు రూ. 13,000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించనుంది. దీంతో పాటు తమ కంపెనీ ఈక్విటీ విలువకు సుమారు రూ. రూ.2,000 కోట్లు వన్-టైం చెల్లింపులను చేపట్టాలని ఎల్ అండ్ టి కంపెనీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ చెల్లింపు పూర్తి చేసిన వెంటనే మెట్రో మొదటి దశ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోకి వస్తుంది. 2014లో దేశంలో మెట్రో రైలు నెట్వర్క్లో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్, ప్రస్తుతం తొమ్మిదవ స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ రద్దీ, ప్రజా రవాణా అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను విస్తరించే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఫేజ్ 2ఏ, 2బి విస్తరణలో భాగంగా ఎనిమిది కొత్త మెట్రో లైన్ల ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
దాదాపు 163 కిలోమీటర్ల మేరకు మెట్రోను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన మెట్రో విస్తరణ ప్రతిపాదనలన్నీ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి.ఇప్పటికే పలు మార్లు సమావేశాలు నిర్వహించిన కేంద్రం ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న ఫేజ్ 1 మెట్రోకు, ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఫేజ్ 2 విస్తరణకు సంయుక్త కార్యాచరణ అవసరమని సూచించింది. అందుకు వీలుగా ఒప్పందం (Definitive Agreement) కావాలని కేంద్రం స్పష్టం చేసింది. ఫేజ్ 2లో కూడా ఎల్ అండ్ టి భాగస్వామ్యం ఉండాల్సి ఉంటుందని కేంద్రం సూచించింది. కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో నెలకొన్న ప్రతిష్టంభనను అధిగమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎల్ అండ్ టి కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు.
ఆర్థిక ఒప్పందాలు, చట్టపరమైన నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ పూర్తి
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ, మెట్రో ఫేజ్ 2లోనూ ఎల్ అండ్ టి భాగస్వామ్యం పంచుకుంటే బాగుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగినంత ప్రాధాన్యతనిస్తుందని సిఎం తెలిపారు. ఫేజ్ 1, ఫేజ్ 2 కారిడార్ల మధ్య సంయుక్త కార్యాచరణకు కచ్చితమైన ఒప్పందం అవసరమని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ఒప్పందం కుదిరితేనే విస్తరించే రైలు కార్యకలాపాలు సజావుగా సాగుతాయని, ఆదాయ వ్యయాల భాగస్వామ్యంలో స్పష్టత ఉంటుందని సిఎం అన్నారు. రవాణా సంబంధిత వ్యాపారం నుంచి కంపెనీ తప్పుకున్నందు వల్ల కంపెనీ ఈక్విటీ భాగస్వామిగా ఉండలేదని ఎల్ అండ్ టి సీఎండీ అన్నారు.
2002 జులై 22న కుదిరిన రాయితీ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం అంగీకరించిన రూ. 3,000 కోట్ల వడ్డీ లేని రుణంలో రూ.2,100 కోట్లు బకాయి ఉందని ఆయన గుర్తు చేశారు. చర్చల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ 1 మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆర్థిక ఒప్పందాలు, చట్టపరమైన నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో మెట్రో రెండో దశ విస్తరణ వేగవంతమవుతుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, ఆమోదం తొందరగా వచ్చే అవకాశముందని సిఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.
ALso Read: ఆర్టిసి బస్సెక్కితే బహుమతులు