Sunday, April 28, 2024

పాక్‌లో పడ్డ భారత క్షిపణి

- Advertisement -
- Advertisement -

India Accidentally Fired Missile Into Pakistan

ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు
సరిచూసుకుంటుండగా గురితప్పింది
ఇరుగుపొరుగు మధ్య కొత్త చిచ్చు

న్యూఢిల్లీ : భారతీయ సూపర్ సోనిక్ క్షిపణి ఒకటి ప్రమాదవశాత్తూ పాకిస్థాన్ గగనతలంలోకి దూసుకువెళ్లింది. ఈ వారం ఆరంభంలో జరిగిన ఈ ఘటన గురించి శుక్రవారం రక్షణ మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటన వెలువరించింది. పూర్తిగా సాంకేతిక తప్పిదం జరిగి, ఈ సంఘటన చోటుచేసుకుందని, జరిగినదానికి ప్రగాఢ రీతిలో చింతిస్తున్నామని ప్రకటనలో తెలిపారు. కోర్టు ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నామని వెల్లడించింది. సరిహద్దుల వెంబడి రక్షణ స్థావరాలలోని క్షిపణులను రోజూ క్రమం తప్పకుండా సరిచూసుకుంటూ, వాటిని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ నెల 9వ తేదీన ఉన్నట్లుండి క్షిపణి ప్రయోగం జరిగింది. ఇది పాకిస్థాన్‌కు చెందిన ప్రాంతంలో ఆకాశంలో చాలా ఎత్తుకు శబ్ధ వేగాన్ని మించిన వేగంతో వెళ్లింది. తరువాత పాకిస్థాన్ లోని కనేవాల్ జిల్లాలోని మియాన్ ఛన్నూ సమీపంలో నేలపై పడింది. అయితే దీనిపై ఎటువంటి వార్‌హెడ్స్ లేవని , దీనితో దీనిని అనుకోకుండా ప్రయోగించినా ఇది పేలలేదని స్పష్టం చేశారు.

అయితే జరిగిన ఘటనపై భారత కేంద్రప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీనిని సాధారణ విషయంగా పరిగణించడం లేదని, వెంటనే ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశిస్తున్నామని తెలిపారు. ప్రమాద ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వివరించారు.క్షిపణి దాదాపు 100 కిలో మీటర్ల మేర పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లింది. దాదాపుగా 40వేల అడుగుల ఎత్తున పయనించింది తరువాత కింద పడింది. ఈ క్షిపణి ఉదంతంపై పాకిస్థాన్ సైనిక విభాగం తీవ్రంగా స్పందించింది. ఇటువంటి పరిణామాలతో పౌర విమానాలకు ముప్పు వాటిల్లుతుందని, ఇది పూర్తిగా భారత్ కవ్వింపు చర్యగా తాము పరిగణిస్తున్నామని పాకిస్థాన్ అధికారికంగా భారత్ దౌత్య వర్గాలకు తెలిపింది. హర్యానాలోని సిస్రా ప్రాంతం నుంచి ఈ మిస్సైల్ వచ్చిపడిందని పాకిస్థాన్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News