పటిష్ట నిఘా, అప్రమత్తమైన ఐఎఎఫ్
న్యూఢిల్లీ: చైనా కవ్వింపు చర్యలతో అప్రమత్తమైన భారత సైన్యం తూర్పులడఖ్ ప్యాంగాంగ్ సరస్సు చుట్టూ వ్యూహాత్మక ప్రాంతాల్లో భారీ సంఖ్యలో బలగాలను మోహరించిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో తాజాగా ఆక్రమణలకు ప్రయత్నించి చైనా విఫలమైంది. ఈ నేపథ్యంలో వాస్తవాధీనరేఖ(ఎల్ఎసి) వెంట అన్ని ప్రాంతాల్లోనూ చైనా బలగాల కదలికలపై భారత సైన్యం నిఘాను పటిష్టం చేసిందని అధికారులు తెలిపారు. ఆగస్టు 29 30 రాత్రి చైనా సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ తెలిపారు. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో ఏకపక్షంగా యథాతథస్థితిని మార్చేందుకు చైనా బలగాలు యత్నించగా, భారత సైన్యం తిప్పికొట్టిందని ఆయన తెలిపారు. తూర్పులడఖ్లో తాజా ఘర్షణల నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిపై ఆర్మీచీఫ్ జనరల్ ఎంఎం నరవణె ఉన్నతస్థాయి సైనికాధికారులతో సమీక్ష నిర్వహించారు. మరోవైపు భారత వైమానిక దళం(ఐఎఎఫ్) కూడా ఎల్ఎసి వద్ద ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. జూన్ 15 ఘర్షణ అనంతరం ఎల్ఎసిలోని కీలక ప్రాంతాల్లో సుఖోయ్ 30, జాగ్వార్, మిరేజ్ 2000 యుద్ధ విమానాలను ఇప్పటికే మోహరించింది.