31 దాకా బ్రిటన్కు విమానాలు రద్దు
కొత్త కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
నేటి అర్ధరాత్రినుంచే అమలు
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడి
న్యూఢిల్లీ: బ్రిటన్లో కొత్తర్తకం కరోనా వైరస్ వెలుగు చూసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంనుంచి విమాన రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించింది. డిసెంబర్ 31 వరకు ఆ దేశానికి వెళ్లే, అక్కడినుంచి వచ్చే విమానాలను రద్దు చేసింది. మంగళవారం(22వ తేదీ)అర్ధరాత్రినుంచే ఈ నిషేధం అమలులోకి వస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది. అంతేకాక బ్రిటన్నుంచి డిసెంబర్ 22వ తేదీ అర్ధరాత్రిలోగా భారత్కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టిపిసిఆర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.
ఒక వేళ ఆర్టిపిసిఆర్ పరీక్షలో పాజిటివ్గా తేలితే వారిని ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్కు పంపుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా ఆయా ప్రయాణికులు ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. బ్రిటన్లో కొత్త రకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని అక్కడి ప్రభుత్వం తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఐరోపా సహా ప్రపంచ దేశాలు అప్రమత్తమైనాయి. ఇప్పటికే పలు దేశాలు బ్రిటన్కు విమాన సర్వీసులను నిలిపివేశాయి. కొత్త వైరస్ వ్యాప్తి దృష్టా బ్రిటన్ ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా కఠిన ఆంక్షలను విధించింది. క్రిస్మస్ వేడుకలను సైతం నిషేధించిన విషయం తెలిసిందే.
India bans international flights from UK