Sunday, April 28, 2024

తొలి రోజే భారత్‌కు పతకాల పంట

- Advertisement -
- Advertisement -

హాంగ్‌జౌ: చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడలు -2023లో భారత్ శుభారంభం చేసింది. ఈ పోటీల్లో తొలిరోజైన ఆదివారం ఈ గేమ్‌లలో భారత క్రీడాకారులు పతకాలు సాధించారు. షూటింగ్‌లో 2, రోయింగ్‌లో 3 పతకాలు భారత్‌కు వచ్చాయి. షూటింగ్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ 1886 పాయింట్లతో రజత పతకాన్ని గెలుచుకుంది. ఈ గేమ్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. మెహులీ ఘోష్, ఆషి చౌక్సే, రమిత త్రయం భారత్‌కు ఈ పతకాన్ని అందించారు. రమిత 631.9, మెహులీ 630.8, ఆషి 623.3 మార్కులు సాధించారు. ఈ ఈవెంట్‌లో ఆతిథ్య చైనా స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇక రమితా జిందాల్ ఆసియా క్రీడల్లో భారత్‌కు ఐదో పతకాన్ని అందించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో రమితా జిందాల్ కాంస్యం సాధించింది. ఈ 19 ఏళ్ల షూటర్ 230.1 స్కోర్‌తో ఈ పతకాన్ని గెలుచుకుంది. చివరి షాట్ వరకు టాప్-2లో నిలిచిన ఆమె మూడో స్థానంలోనే కొనసాగింది. ఈ పోటీలో మెహులీ ఘోష్ నాలుగో స్థానంలో నిలిచారు. అయితే అతిధ్య చైనాకు బంగారు, వెండి పతకాలు వచ్చాయి.

రోయింగ్‌లో రజత పతకం..
పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న భారత జట్టు.. రోయింగ్‌లో రెండో పతకాన్ని కూడా సాధించింది. అర్జున్ లాల్ జాట్, అరవింద్ సింగ్ గేమ్‌లలో భారత్‌కు రెండో పతకాన్ని అందించారు. భారత జోడీ 06:28:18తో రెండో స్థానంలో నిలిచింది. రోయింగ్‌లో భారత్‌కు మూడో పతకం లభించింది. పురుషుల డబుల్స్ ఫైనల్-ఎలో బాబు లాల్ యాదవ్, రామ్ లేఖ్ కాంస్య పతకం సాధించారు. ఈ భారత జోడీ 6:50:41 సమయం తీసుకుని కాంస్యం సాధించింది. ఇక పురుషుల కాకస్డ్ 8 ఈవెంట్‌లో భారత జట్టు 05:43.01తో రజతం గెలుచుకోవడంతో రోయింగ్‌లో భారత్‌కు మూడో పతకం లభించింది. దీంతో రోయింగ్‌లో భారత్ 3 పతకాలు కైవసం చేసుకుంది.

క్రికెట్‌లో పతకం ఖాయం
ఆసియా గేమ్స్ 2023లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. మహిళల క్రికెట్‌లో భారత్‌కు పతకం ఖాయం అయింది. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్‌కు పతకం ఖాయమవడమై కాకుండా ఆసియా క్రీడలు మహిళల క్రికెట్ ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌లో గెలిస్తే భారత్ ఖాతాలో స్వర్ణం వచ్చి చేరుతుంది. కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. భారత బౌలర్ల దాటికి 51 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పూజా వస్త్రేకర్ 4 వికెట్లు పడగొట్టగా సటిటాస్ సాధు, గైక్వాడ్, వైద్యా చెరో వికెట్ పడగొట్టారు. బంగ్లా బ్యాటర్లలో నిగార్ సుల్తానా 12 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అంతేకాదు బంగ్లా బ్యాటర్లలో ఏకంగా ఐదుగురు డకౌట్ అయ్యారు. సుల్తానా తప్ప మిగతా వారందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు. ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు స్మృతి మంధాన(7), షెఫాలీ వర్మ(17) తక్కువ స్కోరుకే పరిమితమైనా. జెమీమా రోడ్రిగ్స్(20), కనికా అహుజా(1) నాటౌట్‌గా నిలిచి లక్ష్యాన్ని పూర్తి చేశారు. దీంతో భారత విజయం లాంఛనమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News