Saturday, May 4, 2024

బాంబు దాడుల మధ్య భయంతో బతుకుతున్నాం

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: గాజాలోని ఉగ్రవాదుల స్థావరాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో దాడులు సాగిస్తోంది. దీంతో గాజా స్ట్రిప్ బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. ఇలాంటి భయానక పరిస్థితుల మధ్య గుండెలరచేతిలో పెట్టుకుని భయంగా బతుకుతున్న ఓ భారత కుటుంబం , తమను కాపాడాలంటూ భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. జమ్ముకశ్మీర్‌కు చెందిన లుబ్నా నజీర్ షాబూ గత కొన్నేళ్లుగా తన భర్త, కుమార్తెతో కలిసి గాజాలో నివసిస్తున్నారు.

హమాస్‌పై ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్… గాజాను అష్టదిగ్బంధనం చేయడంతో షాబూ కుటుంబం అక్కడ చిక్కుకు పోయింది. ఈ పరిస్థితుల్లో ఆమె తాజాగా పిటీఐతో మాట్లాడుతూ తమను అక్కడి నుంచి తరలించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. “ మేం అత్యంత దారుణమైన యుద్ధాన్ని చూస్తున్నాం. బాంబు దాడుల్లో ప్రతి భవనం క్షణాల్లో నేల కూలుతోంది. సామాన్య పౌరుల పైనా దాడులు జరుగుతున్నాయి. హమాస్ దాడికి మేం మూల్యం చెల్లించుకోవలసి వస్తోంది. బాంబు శబ్దాలతో వణికిపోతున్నాం. నీళ్లు రావట్లేడు.

కరెంట్ లేదు. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎక్కడికి వెళ్దామన్నా బాంబుల మోతే. సురక్షిత ప్రాంతమనేదే లేకుండా పోయింది. గాజా స్ట్రిప్ చాలా చిన్న ప్రాంతం. కానీ అన్నివైపుల నుంచి మూసేశారు.దీంతో బయటకు వెళ్లే మార్గమే లేకుండా పోయింది” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సాయం చేయాలని రమల్లా లోని భారత ప్రతినిధుల కార్యాలయాన్ని కోరామని, కానీ ఇంతవరకూ ఎలాంటి స్పందనా రాలేదని, ఆమె తెలిపారు. కాగా, దీనిపై భారత ప్రతినిధుల కార్యాలయం స్పందిస్తూ … గాజా లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు మేం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ క్షేత్రస్థాయిలో యుద్ధ పరిస్థితులు సహకరించడం లేదు” అని వివరించింది. గాజాను ఇజ్రాయెల్ సీజ్ చేసింది . విద్యుత్, ఆహారం, ఇంధనాన్ని నిలిపివేసింది. గాజా నుంచి బయటకు వెళ్లేందుకు ఏకైక మార్గం రఫా క్రాసింగ్. అయితే బాంబు దాడులతో అక్కడకు వెళ్లే మార్గం మూసుకుపోయింది. దీంతో గాజా లోని సామాన్య పౌరులు ఆ ప్రాంతం నుంచి బయటపడలేక పోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News