ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో ముందంజలో బాలికలు
అగ్ర స్థానంలో నిలిచిన అసిఫాబాద్, మేడ్చల్ జిల్లాలు
ఈ సారి పెరిగిన ఉత్తీర్ణత శాతం
ఆన్లైన్ ఫిర్యాదుల విధానం
ద్వారా సందేహాల నివృత్తి
-ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడులయ్యాయి. గు రువారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కా ర్యాలయంలో విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ స్పెషల్ సి ఎస్ చిత్రా రామచంద్రన్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పరీక్షల విభాగం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు 4,80,555 మంది విద్యార్థులు రాయగా 2,88,383 మంది ఉత్తీర్ణులయ్యారని, 60. 01% ఉత్తీర్ణత నమోదైందని పేర్కొన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 4,11,631 మంది పరీక్షలు రాయగా, 2,83,462 మంది ఉత్తీర్ణులయ్యారని, 68.86 శాతం ఉత్తీర్ణత నమోదైందని అన్నారు.
ఇంటర్ ఫలితాల నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కావద్దని మంత్రి సూచించారు. ఇంటర్లో ఫెయిలైనా, పాసైనా తల్లిదండ్రులు విద్యార్థులను ఎలాంటి ఇబ్బందులు పెట్టుకుండా వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో ఎవరికైనా మానసిక సమస్యలు ఉన్నట్లు గుర్తిస్తే ప్రతి కళాశాలల్లో అందుబాటులో ఉన్న స్టూడెంట్ కౌన్సిలర్లను లేదా ఇంటర్ బోర్డు నియమించిన క్లినికల్ సైకాలజిస్టులను సంప్రదించాలని కోరారు. విద్యార్థుల మానసిక స్థితిని బట్టి సైకాలజిస్టులు,స్టూడెంట్ కౌన్సిలర్లు విద్యార్థులకు తగిన సలహాలు, సూచనలు, గైడెన్స్ అందిస్తారని తెలిపారు. జీవితం చాలా విలువైందని, పరీక్షల్లో ఫెయిలయ్యామని ఎవరూ అర్థాంతరంగా తమ విలువైన జీవితాలను కోల్పోవద్దని పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాలలో ఎప్పటిలాగే బాలికలు ముందంజలో ఉన్నారు.
మొదటి సంవత్సరంలో బాలికలు 67.47 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించగా, బాలురు 52.30 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే రెండవ సంవత్సరంలోనూ కూడా 75.15 శాతం ఉత్తీర్ణతతో బాలికలు ముందంజలో ఉండగా, బాలుర ఉత్తీర్ణత 62.10 శాతంగా నమోదైందని తెలిపారు. ప్రథమ సంవత్సర ఫలితాలలో రాష్ట్ర సగటు 60.01 శాతం నమోదుకాగా, బాలికల ఉత్తీర్ణత 67.47 శాతం నమోదైంది. అలాగే ద్వితీయ సంవత్సర ఫలితాలలో రాష్ట్ర సగటు 68.86 శాతం నమోదుకాగా, బాలికల ఉత్తీర్ణత 75.15 శాతం నమోదైంది. అలాగే ప్రథమ సంవత్సరం జనరల్లో 4,31,353 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,63,463 (66 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్లో 19,792 మంది బాలికలు హాజరు కాగా, 13,416(61.07 శాతం) శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్లో 49,207 మంది హాజరుకాగా, 24,920 మంది(50.65 శాతం) ఉత్తీర్ణత నమోదైంది. అలాగే ద్వితీయ సంవత్సరంలో జనరల్లో 3,74,492 మంది పరీక్షలకు హాజరు కాగా, 2,60,703(69.61 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్లో 3,660 మంది హాజరుకాగా, 1,713 మంది (47 శాతం) ఉత్తీర్ణత నమోదైంది.
అత్యధిక విద్యార్థులకు ఎ గ్రేడ్
ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో జనరల్లో 1,49,038 మంది విద్యార్థులు ఎ గ్రేడ్ సాధించగా, 69,547 మంది బి గ్రేడ్, 31,353 మంది సి గ్రేడ్, 13,525 మంది డి గ్రేడ్ సాధించారు. ఒకేషనల్లో 15,207 మంది విద్యార్థులు ఎ గ్రేడ్, 9,063 మంది బి గ్రేడ్, 609 మంది సి గ్రేడ్, 41 మంది డి గ్రేడ్ సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరం రెగ్యులర్లో 1,53,995 మంది ఎ గ్రేడ్ సాధించగా, ప్రైవేట్ 22 మంది విద్యార్థులు ఎ గ్రేడ్ సాధించారు. రెగ్యులర్లో 71,737, ప్రైవేట్లో 30 మంది బి గ్రేడ్, రెగ్యులర్లో 26,994 మంది , ప్రైవేట్లో 28 మంది సి గ్రేడ్, రెగ్యులర్లో 7,977 మంది, ప్రైవేట్లో 16 మంది డి గ్రేడ్ సాధించారు. ఒకేషనల్లో రెగ్యులర్లో 13,947 ఎ గ్రేడ్ సాధించగా, బి గ్రేడ్లో 8,359, , సి గ్రేడ్లో 429, డి గ్రేడ్లో రెగ్యులర్లో 24 మంది ఉత్తీర్ణత సాధించారు.
ప్రథమ స్థానంలో అసిఫాబాద్, మేడ్చల్
రాష్ట్ర ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అసిఫాబాద్, మేడ్చల్ జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఈ రెండు జిల్లాలు 80 శాతం ఉత్తీర్ణతతో జిల్లా ప్రథమ స్థానం దక్కించుకున్నాయి. 76 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా తృతీయ స్థానంలో నిలిచింది. మెదక్ జిల్లాలో అత్యల్పంగా 42 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే ప్రథమ సంవత్సరం ఫలితాలలో 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, 71 శాతం ఉత్తీర్ణతతో అసిఫాబాద్ కొమురం భీం, రంగారెడ్డి జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచాయి.
పెరిగిన ఉత్తీర్ణత శాతం
ఇంటర్ ఫలితాలలో ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ద్వితీయ సంవత్సరంలో 4,11,631 మంది(68.86 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 2018- 19 విద్యాసంవత్సరంలో 4,18,271 మంది(65.01 శాతం), 2017- 18లో 4,29,378(67. 25 శాతం), 2016- 17లో 4,14,213 (66.45 శాతం), 4,18,231(62.70 శాతం) ఉత్తీర్ణత నమోదైంది. గత ఐదేళ్లలో ఈ సంవత్సరమే అత్యధికంగా ఉత్తీర్ణత శాతం నమోదైంది.
ఎంపిసిలో అత్యధిక ఉత్తీర్ణత
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఈ సారి ఎంపిసి గ్రూప్లో అత్యధిక ఉత్తీర్ణత నమోదైంది. ఎంపిసి గ్రూప్లో మొత్తం 1,79,196 మంది విద్యార్థులు(67.95%) ఉత్తీర్ణులు కాగా, బైపిసి గ్రూప్లో 1,04,43 5 మంది(65.32% ఉత్తీర్ణులయ్యారు. అలా గే సిఇసి గ్రూప్లో 1,25,286 మంది (41.59 శాతం) ఉత్తీర్ణత నమోదు కాగా, ఆర్ట్ గ్రూప్లో 35,752 మంది(52.31 శాతం) ఉత్తీర్ణత నమోదైంది.
24లోగా రీకౌంటింగ్కు ఫీజు చెల్లించాలి
ఇంటర్ మార్కుల రీ కౌంటింగ్, జవాబుపత్రాల రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 24వ తేదీలోగా ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. రీ కౌంటింగ్కు ఒక్కో పేపర్కు రూ.100, స్కాన్ చేసిన జవాబు పత్రాలు, రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో పేపర్కు రూ.600 చెల్లించాలి.www.tsbie.cgg.gov.inద్వారా విద్యార్థులు ఫీజు చెల్లించాలి.
సందేహాల నివృత్తి ఆన్లైన్ ఫిర్యాదుల విధానం
ఇంటర్ ఫలితాలలో ఏమైనా తప్పులు దొర్లినట్లు విద్యార్థులు గుర్తిస్తే తమ సమస్యల పరిష్కారం కోసం ఇంటర్ ఆన్లైన్ ఫిర్యాదుల విధానం (బోర్డు ఆఫ్ ఇంటర్మీడియేట్ గ్రివియెన్స్ రిడ్రెసల్ సిస్టమ్- బిఐజిఆర్ఎస్)లో ఫిర్యాదు చేసుకోవాలి. ఈ మేరకు ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ప్రత్యేక విండోను అందుబాటులో ఉంచింది. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాలలో ఎలాంటి సందేహాలు ఉన్నా www.bigrs. telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేయడానికి విద్యార్థికి లేదా తల్లిదండ్రులకు ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుంది. విద్యార్థులు ఫిర్యాదు చేసిన వెంటనే వారి ఫోన్ నెంబర్కు టోకన్ నెంబర్తో ఎస్ఎంఎస్ వస్తుంది. విద్యార్థులు ఆన్లైన్లో ఫిర్యాదు చేసిన వెం టనే సంబంధిత అధికారికి, ఉన్నతాధికారులకు సమాచారం వెళుతుంది. విద్యార్థుల ఫి ర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. వి ద్యార్థుల ఫిర్యాదులను నిర్ధిష్ట కాలపరిమితి తో రెండు మూడు రోజుల్లో పరిష్కారించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఒత్తిడి నివారణకు సైకాలజిస్టుల సేవలు
ఇంటర్ ఫలితాల నేపథ్యంలో విద్యార్థుల మానసిక ఒత్తిడి నివారణకు ఇంటర్ బోర్డు ఏడుగురు క్లినికల్ సైకాలజిస్టులను నియమించింది. మానసిక ఒత్తిడికి లోనయ్యే విద్యార్థులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫోన్లో సైకాలజిస్టులను సంప్రదించి తగిన సలహాలు, సూచనలు పొందవచ్చు.