ఉరుము ఉరిమి మంగలంమీద పడిన చందంగా ఇరాన్ -ఇజ్రాయెల్ (Iran Israel war) మధ్య రగిలిన యుద్ధజ్వాలల ప్రభావం పరోక్షంగా భారత్పై పడే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇరాన్- ఒమన్ దేశాలను విభజిస్తూ, పర్షియన్ గల్ఫ్కు దారితీసే కీలకమైన హర్మూజ్ జలసంధికి యుద్ధం విస్తరించినట్లు తాజాగా ఆ ప్రాంతంలో మూడు నౌకలు దగ్ధమవడాన్ని బట్టి తెలుస్తోంది. అదే నిజమైతే, భారత్ సహా అనేక దేశాలు చమురు సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడే పరిస్థితి ఎంతో దూరంలో లేదు. అత్యంత ఇరుకైన హర్మూజ్ జలసంధి ద్వారానే పశ్చిమాసియా దేశాలనుంచి ప్రపంచానికి రోజూ కోట్లాది పీపాల చమురు రవాణా అవుతూ ఉంటుంది.
పశ్చిమాసియా దేశాలనుంచి భారత్ దిగుమతి చేసుకునే చమురులో 40 శాతం ఈ మార్గం ద్వారానే వస్తుంది. యుద్ధ సమయంలో ఈ మార్గం గుండా వెళ్తున్న చమురు ఓడలపై దాడులు చేసి, వైరిపక్షాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించడం కద్దు. నాలుగు దశాబ్దాల కిందట ఇరాన్ ఇరాక్ మధ్య యుద్ధం మొదలైనప్పుడు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే చమురు ఓడలపై పరసర్పం దాడులు జరుపుకోవడంతో ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో చిక్కుకున్న విషయం విస్మరించరాని అంశం. ఇరాన్ ఒమన్ దేశాలను విడదీసే హర్మూజ్ జలసంధిపై ఇరాన్దే ఆధిపత్యం. యుద్ధం ముదిరితే ఈ జలసంధిని ఇరాన్ మూసివేసే ప్రమాదం ఉంది. అలాగే ఇరాన్ నుంచి చమురును రవాణా చేసే ఓడలపై ఇజ్రాయెల్ దాడులు చేయనూవచ్చు. దీంతో చమురు అందక అనేక దేశాలు అల్లాడిపోవడం తథ్యం.
భారత్కు సైతం ఒకప్పుడు ఇరానే అతి పెద్ద చమురు ఎగుమతిదారు. 2019లో అమెరికా ఆంక్షలు విధించడంతో ఇరాన్ నుంచి చమురు దిగుమతులు తగ్గించుకుని, రష్యా, ఇరాక్, సౌదీ అరేబియాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. హర్మూజ్ జలసంధిలో దాడులు పెరిగితే చమురు రవాణా స్తంభించిపోయి, ధరలు ఆకాశాన్నంటితే ఆ పరిణామం భారత్కూ ప్రమాద హేతువే. మరోవైపు దౌత్యపరంగానూ భారత్ చిక్కుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలతో భారత్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రెండింటిలో ఏదో ఒక దేశాన్ని ఎంచుకోమంటే అది భారత్కు ఆత్మహత్యాసదృశమే అవుతుంది. అందుకే ఎప్పటిలాగే తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. ఇటీవల షాంఘై సహకార సంస్థ ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని నిర్ద్వంద్వంగా ఖండించగా, భారత్ మాత్రం దౌత్యపరమైన మార్గాల ద్వారా యుద్ధానికి పరిష్కారం కనుగొనాలంటూ మధ్యేమార్గాన్ని అనుసరించింది.
షాంఘై సహకార సంస్థలో ఇరాన్, భారత్ (Iran Israel war) రెండూ సభ్యదేశాలే అయినప్పటికీ భారత్ గోడమీది పిల్లివాటాన్ని ప్రదర్శించడం అనేక విమర్శలకు దారితీసింది. బ్రెజిల్లో వచ్చే నెలలో జరగనున్న బ్రిక్స్ సదస్సు కూడా భారత్కు సంకటంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. బ్రిక్స్ దేశాల కూటమిలో ఇరాన్కు కూడా సభ్యత్వం ఉండటంతో భారత్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి చందంగా మారబోతోంది. ఇరాన్ను సమర్ధించడం ద్వారా ఇజ్రాయెల్తో విభేదిస్తే అమెరికాతో కోరి కయ్యం తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇక, ఇరాన్లో భారత్ ఇప్పటికే చేపట్టిన చాబహార్ ఓడరేవు నిర్వహణపై కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లే కనిపిస్తోంది. ఈ ఓడ రేవు కోసం భారత్ ఇప్పటికే కోట్లాది డాలర్లు ఖర్చు చేసింది.
ఇజ్రాయెల్ దాడుల్లో ఓడరేవు దెబ్బతింటే, అది భారత్కు తీరని నష్టం కలిగిస్తుంది. మరోవైపు ఇరాన్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులను క్షేమంగా స్వదేశానికి తీసుకురావలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. యుద్ధ నేపథ్యంలో ఇరాన్ గగనతలాన్ని మూసివేయడంతో టెహ్రాన్ నుంచి భూమార్గం ద్వారానే విద్యార్థుల్ని తీసుకురావలసి ఉంటుంది. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధానికి చరమగీతం పాడేందుకు అగ్రదేశాలు చేయీచేయీ కలపకపోతే చమురు సంక్షోభం ప్రపంచాన్ని కుదిపివేయడం తథ్యం.
ఇప్పటికే చమురు ధరలు అంతకంతకూ ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, (Iran Israel war) యుద్ధం మరింత ముదిరితే ద్రవ్యోల్బణం పెచ్చుమీరి, అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం కావచ్చు. అయితే, అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేస్తే తప్ప ఈ యుద్ధం ఆగేది కాదని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ మొండికేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ తోనూ, ఇజ్రాయెల్ తోనూ స్నేహ సంబంధాలు గల భారత్ మధ్యవర్తిత్వానికి నడుం బిగించాలి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను నివారించే సామర్థ్యం భారత ప్రధానికి ఉందంటూ భారత్లో ఇజ్రాయెల్ రాయబారి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గమనార్హం.