Monday, May 6, 2024

ఎసి గదుల్లో కూర్చుంటే అభివృద్ధి కనిపించదు: మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట వ్రత మండపంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకల్లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర అభివృద్థి ఏసీ గదుల్లో కూర్చునే వారికి కనిపించదని అన్నారు. కొంతమంది ఏసీ గదిలో కూర్చుని అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నిస్తున్నారని అని ఆయన విమర్శించారు. అభివృద్ధి ఎక్కడ జరిగిందో సంక్షేమ పథకాలు ఎక్కడ అమలవుతున్నాయో అక్కడే దశాబ్ది ఉత్సవాలను ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి ప్రతిపక్షాల కళ్ళకు కనపడటం లేదాని ప్రశ్నించారు. స్వరాష్ట్రంలో సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని,కరెంటు కష్టాల నుంచి బయటపడ్డామని, మంచినీటి కష్టాలు తీరాయి ఫ్లోరైడ్ రక్కసి సమస్య నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా బయటపడిందన్నారు. వ్యవసాయ రంగంలో గణనీయ ప్రగతిని సాధించడమే కాకుండా సంక్షేమ పథకాల అమలుతో బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడంతో సమాజంలో శాంతి సామరస్యాలు నెలకొంటాయన్నారు.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ఆధ్యాత్మిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. యాదగిరిగుట్ట – రాయగిరి లో రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వేద పాఠశాలకు మంత్రులు భూమిపూజ చేశారు. అన్నదాన సత్రాన్ని, కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ పమేలా సత్పతి, ఇతర ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News