పొలంలో 24వ తీర్థంకరుడి విగ్రహాలు లభ్యం
సందర్శించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర: శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న కరీంనగర్ జిల్లాలో జైనుల ఉనికి మరోసారి బయటపడింది. 6వ శతాబ్దానికి చెందిన జైనుల 24వ తీర్థంకరుడు, జైన మత వ్యాప్తి కోసం విశేషంగా కృషి చేసిన అతడి విగ్రహాలు బయటపడ్డాయి. కరీంనగర్ జిల్లా, గంగాధర మండలం(కోట్ల) నర్సింహాలపల్లిలో ఒగ్గు అంజయ్య అనే రైతుకు చెందిన భూమిని ట్రాక్టర్తో దున్నుతుండగా వర్ధమాన మహావీరుని విగ్రహం బయటపడింది. రెండేళ్ల క్రితం కూడా దుక్కి దున్నుతుండగా తీర్థంకరుని విగ్రహం బయటపడింది. దీంతో జైనులు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే అక్కడ సంచరించినట్లు స్పష్టం అవుతోంది. బీహార్లోని వైశాలికి సమీపంలోని కుండ గ్రామంలో క్రీస్తు పూర్వం 599వ సంవత్సరంలో క్షత్రియ కుటుంబానికి చెందిన సిద్ధార్థ మహారాజుకు, రాణి త్రిషాలకు జన్మించిన మహావీరుడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వర్ధమానుడు.
మహావీరుడి తల్లిదండ్రులు 28వ ఏట మరణించగా యశోదరను వివాహమాడి ఓ కుమార్తెకు జన్మనిచ్చిన తరువాత 36వ ఏట సన్యాసాన్ని స్వీకరించాడు. 12 ఏళ్ల పాటు తపస్సు చేసి మహావీరుడుగా జైనమత ప్రచారకుడయ్యాడు. అప్పటికే జైన మతానికి 23 మంది తీర్థంకరులుగా ఉన్నప్పటికీ మహావీరుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత జైనమత వ్యాప్తి విస్తృతంగా జరిగింది. 32 ఏళ్లపాటు అహింసా ధర్మంతో ప్రచారం జరిపిన మహావీరుడు 72వ ఏట మరణించారు. అయితే క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన వర్ధమాన మహావీరునికి సంబంధించిన విగ్రహాలు లభ్యం అయ్యాయంటే క్రీ.పూ. 5 లేదా 4 శతాబ్దానికి చెందినవారు ఈ విగ్రహాలు స్థాపించి ఉంటారని భావిస్తున్నారు.
నర్సింహులపల్లికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొమ్మలగుట్ట వద్ద క్రీస్తు శకం 9వ శతాబ్దానికి చెందిన ఆనవాళ్లు ఉన్నాయంటే ఈ ప్రాంతంలో జైనులు సంవత్సరాల పాటు సంచరించినట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి అత్యంత అరుదైన ఘన చరిత్రను తనలో దాచుకున్న కరీంనగర్ నేపథ్యాన్ని భావితరాలకు అందించేందుకు చరిత్రకారులు లోతైన పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వర్ధమాన మహావీరుడు జైనమత 24వ తీర్థంకర విగ్రహాన్ని సందర్శించారు.