హైదరాబాద్: పోలీసుల్లో కరోనా ఆందోళన కన్పిస్తోంది. వరుసగా మూడు పోలీస్ కమిషనరేట్లలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో తమకు కూడా వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. లాక్డౌన్ సమయంలో విధులు నిర్వర్తించిన పోలీసులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పుడు లాక్డౌన్ ఎత్తి వేయడంతో జిహెచ్ఎంసి పరిధిలోని జనాలు రోడ్లపైకి వచ్చి వారి పనులు చేసుకుంటున్నారు. దీంతో ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో తెలియడంలేదు. పోలీసులకు విధులు నిర్వర్తించడం తప్పదు కనుక వాహన తనిఖీల సమయంలో కరోనా పాజిటివ్ ఉన్న వారి నుంచి వచ్చే అవకాశం ఉంది.
దీంతో తమకు కూడా వస్తుందేమోనని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. పోలీసుల రక్షణ కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు పోలీసుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయడంతోపాటు పోలీస్ స్టేషన్లలో శానిటైజర్లు, మాస్కులు, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. తప్పనిసరిగా పోలీసులు వీటిని పాటించాలని కోరారు. మూడు కమినరేట్లలో పోలీసు సిబ్బంది కొరత ఉంది, దానికి తోడు వరుసగా కరోనా బారినపడుతుండడంతో విధులు నిర్వర్తించడం ఇబ్బందిగా మారింది. ఇప్పటి వరకు మూడు పోలీస్ కమిషనరేట్లలో దాదాపు 100మంది వరకు పోలీసులు కరోనా బారిన పడ్డారు. గతంలో మర్కజ్కు వెళ్లి వచ్చిన పోలీసులకు కరోనా పాజిటివ్ రాగా ఇప్పడు లాక్డౌన్ విధులు నిర్వర్తించిన వారు కరోనా బారినపడుతున్నారు.
సిబ్బంది కొరత…
నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది వరుసగా కరోనా బారినపడుతున్నారు. పాతబస్తీ ఏరియాలోని పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించిన పోలీసులు వరుసగా పాజిటివ్గా వస్తోంది. వారిలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. యాదాద్రి భువనగిరికి చెందిన హోంగార్డు పాతబస్తీలో లాక్డౌన్ విధులు నిర్వర్తించాడు, వరంగల్ జిల్లా, కాజిపేటకు చెందిన కానిస్టేబుల్ పాతబస్తీలో విధులు నిర్వర్తించగా మూడు రోజుల క్రితం పాజిటివ్గా వచ్చింది. బంజారాహిల్స్కు చెందిన కానిస్టేబుల్ కరోనా పాజిటివ్ ఉండగా తరచూ పోలీస్ స్టేషన్ వచ్చి వెళ్లడంతో 15మంది పోలీసులకు పాజిటివ్ వచ్చింది. దీంతో స్టేషన్లోని మిగతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తమకు కూడా పాజిటివ్ వస్తుందని ఆందోళన చెందుతున్నారు. సైదాబాద్,సైఫాబాద్, చిక్కడపల్లి, ఎస్ఆర్ నగర్, కుల్సుంపుర, బంజారాహిల్స్, చాదర్ఘాట్, బాలాపూర్ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు కరోనా బారిన పడ్డారు. వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించేందుకు ముగ్గురు సిపిలు చర్యలు తీసుకున్నారు.