Wednesday, May 1, 2024

నేటి నుంచి జెఇఇ మెయిన్ రెండో విడత పరీక్షలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యే జెఇఇ మెయిన్ 2024 తుది విడత పరీక్ష గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏప్రిల్ 4,5,6,8,9,12 తేదీల్లో జరిగే జెఇఇ మెయిన్ రెండో విడత పరీక్షల కోసం సన్నద్ధమైన విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను https://jeemain.nta.ac.in/ వెబ్‌సైట్ నుంచి ఎప్పటికప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎన్‌టిఎ సూచించింది.

విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు
విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా అడ్మిట్ కార్డును తమ వెంట తీసుకొని వెళ్లాలి. అడ్మిట్ కార్డులో ఉన్న సూచనలను క్షుణ్ణంగా చదివి, అందులో పొందుపరిచిన అన్ని నిబంధనలు పాటించాలి. పరీక్ష రాసే విద్యార్థులు తమ ధ్రువీకరణను నిర్ధారించే ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులను తీసుకెళ్లడం తప్పనిసరి. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా 12వ తరగతి అడ్మిట్ కార్డు, అభ్యర్థి ఫొటో ఉన్న బ్యాంకు పాసు పుస్తకం.. వీటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.

అలాగే పాస్‌పోర్టు సైజ్ ఫొటోను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లడం మరిచిపోవద్దు. విద్యార్థులు దరఖాస్తు చేసినప్పుడు అప్‌లోడ్ చేసిన ఫొటోను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే దాన్ని అటెండెన్స్ షీట్‌లో అతికించాల్సి ఉంటుంది. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే బాల్‌పాయింట్ పెన్ను తీసుకెళ్లాలి. వికలాంగులైన విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు తమ వెంట మెడికల్ ఆఫీసర్ ద్రువీకరించిన సర్టిఫికెట్‌ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆభరణాలు, నగలు లేకుండా చూసుకోవాలి. ఉంగరాలు, గాజులు వేసుకోకుంటే మంచిది.

పరీక్షా కేంద్రం వద్ద వీటికి నో ఎంట్రీ
చిరుతిళ్ళు, జామెట్రీ/ పెన్సిల్ బాక్స్, హ్యాండ్ బ్యాగ్, పర్సు, పేపర్లు/స్టేషనరీ, ప్రింటెడ్ మెటీరియల్, వాటర్ బాటిళ్లు, మొబైల్‌ఫోన్/ఇయర్ ఫోన్/మైక్రోఫోన్/పేజర్, కాలిక్యులేటర్, డాక్యుపెన్, కెమెరా, టేప్ రికార్డర్ వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు/గ్యాడ్జెట్లు/పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. వీటితో పాటు హ్యాండ్ బ్యాగ్లు, పర్సులు, నగలు, మెటాలిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి నిషేధం. మధుమేహంతో బాధపడే విద్యార్థులైతే షుగర్ టాబ్లెట్స్/పండ్లు వంటివి వెంట తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. చాక్లెట్లు/క్యాండీ/శాండ్విచ్ వంటి ప్యాక్ చేసిన ఆహారపదార్థాలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అనుమతించరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News