కేంద్రాన్ని శాసించే స్థాయికి ఎదుగుతాం
ఇతర పార్టీల వారు కొంతమంది పగటి కలలు కంటున్నారు
అవి నెరవేరేవి కావు, మాకు అన్ని రకాల అంచనాలు, సర్వేలు ఉన్నాయి, దళితులకు 3ఎకరాలు ఇస్తామని చెప్పలేదు
ప్రతి ఎస్సి కుటుంబానికి కనీసం 3 ఎకరాలు ఉండాలనే అన్నాం : సిఎం
మనతెలంగాణ/హైదరాబాద్ : భవిష్యత్లోనూ అధికారం తమదే అని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. మంగళవారం నాడు శాసనసభలో దళితబంధు పథకంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సిఎం వివరణ ఇస్తూ వచ్చే టర్మ్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే అన్నారు.తమకు ఉన్న నాలుగు ఎంపీ సీట్లే ఒకనాడు కేంద్రానికి అవసరం అయ్యాయన్నారు.భవిష్యత్లో కేంద్రాన్ని శాసించే స్థాయికి తాము ఎదిగే అవకాశం ఉందన్న ధీమాను వ్యక్తం చేశారు. ఇతర పార్టీల వారు కొంత మంది పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. వారి కలలు ఎప్పటికీ నెరవేరవని సిఎం తేల్చిచెప్పారు. తమది కూడా రాజకీయపార్టీయే తప్ప మఠం కాదన్నారు. తమకు కూడా అన్ని రకాల అంచనాలు , సర్వేలు ఉన్నాయని దానికి అనుగుణంగా నడుచుకుంటామని చెప్పారు. వచ్చే టర్మ్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని అందులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.
ప్రతి ఎస్సీ కుటుంబానికి కనీసం 3 ఎకరాలు ఉండాలని చెప్పానంటూ వివరణ ఇచ్చారు. దళితబంధు పథకంతో పాటు మూడెకరాల భూమి కూడా ఇస్తారా అంటూ మజ్లిస్ సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు సీఎం బదులిచ్చారు. దళితులకు ఎకరం ఉంటే 2 ఎకరాలు కొనిస్తామని.. ఒకటిన్నర ఎకరం ఉంటే మరో ఒకటిన్నర ఇస్తామన్నామని చెప్పారు.రఘునందన్ రావుకి చాలా పెద్ద సందేహం వచ్చిందని దళితబంధు నిధులు ఒక్క హుజూరాబాద్కే విడుదల చేసిండ్రా అని చెప్పారన్నారు.తమకు చాలా బాధ్యత ఉందన్నారు ఈ రాష్ట్రం తెచ్చిన వాళ్లం మేమే అని, ముందర కూడా తామే ఉంటామన్నారు. తమ అంచనాలు తమకు ఉన్నయన్నారు. కొంతమందికి ఏదో ఈస్ట్మన్ కలర్ డ్రీమ్స్ ఉండొచ్చని , కానీ తమది రాజకీయ పార్టీయే కదా, మాదేమన్న మఠమా? మాకు తెల్వదా మాకు అంచనాలు, సర్వేలు ఉండవా? భవిష్యత్లో కూడా మా ప్రభుత్వమే కొనసాగుతుంది అందులో అనుమానం ఎందుకు? ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ప్రజలు ఎందుకు పక్కన పెడతరు? ఏం కారణం చేత పక్కన పెడతారని ప్రశ్నించారు. తమ పథకాల పట్ల ,ప్రజల పట్ల విశ్వాసం ఉందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.