Sunday, April 28, 2024

కేరళ గవర్నర్ సరిగ్గా విధులు నిర్వహించడం లేదు : కేరళ సిఎం విజయన్

- Advertisement -
- Advertisement -

కోచి : గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తన విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ కేరళ ముఖ్యమంత్రి విజయన్ గురువారం ఆరోపించారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు, కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. నిన్నటి రోజున గవర్నర్ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ముఖ్యమంత్రి విజయన్ గురువారం స్పందించారు. గవర్నర్ సంఘ్ పరివార్ వాదిగా ఉన్నా తమకెలాంటి సమస్య లేదని, కానీ గవర్నర్‌గా ఆయన విధులు నిర్వర్తిస్తే చాలని ముఖ్యమంత్రి విజయన్ వ్యాఖ్యానించారు. గవర్నర్ ఖాన్ బుధవారం మాట్లాడుతూ ఏదైనా సలహా ఇవ్వడానికి తాను సుముఖంగానే ఉంటానని, కానీ తనపై ఒత్తిడి మాత్రం తీసుకురాకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏదైనా బిల్లు లేదా ఆర్డినెన్స్ అత్యవసరం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని గవర్నర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను అజాద్ కశ్మీర్‌గా వ్యాఖ్యానించడం మార్కిస్ట్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు మానుకోవాలని ముఖ్యమంత్రికి గవర్నర్ సూచించారు.

వేర్పాటు వాదానికి ప్రాంతీయ తత్వానికి ఆజ్యం పోయరాదని సూచించారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం పంపిన రెండు ఆర్డినెన్స్‌లపై సంతకం గురించి మీడియా ప్రతినిధులు బుధవారం ప్రస్తావించినప్పుడు గవర్నర్ …ముఖ్యమంత్రిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళలో ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య చాలా కాలంగా వివాదం సాగుతోంది. ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు తరువాత ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. కేరళ లోని కర్పూర్ యూనివర్శిటీ ఉపకులపతిగా గోపీనాథ్ రవీందన్‌ను తిరిగి నియమించడాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో కేరళ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, రవీంద్రన్‌ను తిరిగి నియమిస్తూ గవర్నర్ ఇచ్చిన తీర్పునూ సుప్రీం కోర్టు ఆక్షేపించింది. దీనిపై గవర్నర్ స్పందిస్తూ రవీంద్రన్‌ను విసిగా నియమించాలంటూ ముఖ్యమంత్రి విజయన్ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందును తప్పు పట్టడానికి కారణం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News